సాక్షి, కృష్ణా: పోలవరం కుడికాలువ ఆయకట్టు రైతుల సమస్యలపై వైఎస్సార్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబుకు లేఖరాశారు. పోలవరం కుడి ప్రధాన కాలువ పై వ్యవసాయ పంపు సెట్లు, విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరించాలని కోరారు. కాలువ నీటిని ఎత్తిపోసే వ్యవసాయ పంపు సెట్లకు హఠాత్తుగా విద్యుత్ నిలిపివేయడం వల్ల వేలాది రైతు కుటుంబాల జీవనోపాధి, ఖరీఫ్ పంటలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయని లేఖలో తెలిపారు.
లేఖలో... సీతారామపురం, మర్రిబంధం, రేమల్లె, వేలేరు, రంగన్నగూడెం, సింగన్నగూడెం, శోభనాద్రిపురం, బండారుగూడెం, బల్లిపర్రు, తెంపల్లి, గొల్లనపల్లి, బి.బి.గూడెం, పురుషోత్తపట్నం, గోపవరపుగూడెం, కొండపావులూరు, సూరంపల్లి, రామచంద్రపురం, నున్న, పాతపాడు, పి. నైనవరం గ్రామాలు కాలువ నీటిపై ఆధారపడి ఉన్నాయి. ఈ గ్రామాల్లో పొలాలకు నీరు కావాలంటే మోటార్లు ఒక్కటే మార్గం. కాలువ ద్వారా తమ పొలాలకు కూడా నీరు అందుతుందనే నమ్మకంతో రైతులు సహకరించారు
2015లో అప్పటి ముఖ్యమంత్రిగా మీరే కాలువ నీటిని ఎత్తిపోసుకోవడానికి అంగీకరించారు.12 ఏళ్లుగా రైతులు పట్టిసీమ , పోలవరం కాలువ నీటిని మోటార్ల ద్వారా వాడుకుంటూ పంటలు పండిస్తున్నారు. ఇది నీటిపారుదల, రెవెన్యూ విద్యుత్ శాఖల పర్యవేక్షణలోనే బహిరంగంగా జరుగుతోంది. రైతులు విద్యుత్ కనెక్షన్లు, పైప్లైన్లు, మోటార్లు, విత్తనాలు ఎరువుల కోసం లక్షల్లో పెట్టుబడి పెట్టారు. పంట రుణాలు తీసుకున్నారుసగం ఖరీఫ్ సీజన్ పూర్తయ్యాక విద్యుత్ నిలిపివేయడం తీవ్ర అన్యాయం అని అన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు నీటిపారుదల , రెవెన్యూ శాఖల సమక్షంలో విద్యుత్ కనెక్షన్లు తొలగించినట్లు APCPDCL అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేఖ ద్వారా తెలిపారు. రైతులకు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, వారి వివరణ వినకుండా ఈ చర్యలు తీసుకున్నారు. జూన్ నుంచి నీరు విడుదల చేస్తామని ప్రకటించి రైతులను సాగుకు సిద్ధం కావాలని కోరింది ప్రభుత్వమే అలాంటప్పుడు ఇప్పుడు విద్యుత్ నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
తక్షణమే కలెక్టర్ ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని ఖరీఫ్ పంటలను కాపాడేందుకు వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలి. నీటిపారుదల నిపుణులు, అధికారులు, రైతు ప్రతినిధులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి. కాలువ నీటి ప్రవాహం పంట అవసరాల ప్రాతిపదికన శాస్త్రీయ నీటి వాటా పై ప్రణాళికను రూపొందించాలి. పోలవరం కుడి కాలువ నుంచి మెట్ట భూములకు నీటి ఎత్తిపోతలపై స్పష్టమైన,శాశ్వత విధానాన్ని ఖరీఫ్/రబీ షెడ్యూల్స్లో చేర్చాలి.
పవర్కట్ల వల్ల ఇప్పటికే ఎండిపోయిన పంటలకు రెవెన్యూ, వ్యవసాయ శాఖల ద్వారా అంచనా వేసి నష్ట పరిహారం అందించాలి.గన్నవరం మాజీ ఎమ్మెల్యేగా పోలవరం కుడి ప్రధాన కాలువ పరివాహక ప్రాంతంలోని మెట్ట గ్రామాల రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు వారి కుటుంబాల ప్రయోజనాల దృష్ట్యా వినతిపత్రాన్ని రాస్తున్నానని తెలిపారు.


