మట్టిలో రూ.350 కోట్ల దోపిడీ..!
పోలవరం కుడి ప్రధాన కాలువకు తూట్లు పొడిచి మట్టి దందా
ముఖ్యనేత ఆశీస్సులతో పచ్చ ముఠాల బరి తెగింపు
లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మాయం.. కేజీఎఫ్ను తలపిస్తున్న గనులు
వేలాది టిప్పర్లతో దోపిడీ
అమరావతి కాంట్రాక్టర్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వైనం
కాలువ గట్లు బలహీనపడటంతో వరద ముప్పుపై ఆందోళన.. అటువైపు కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం
విచ్చలవిడి తవ్వకాలపై ఆర్టీఐ ద్వారా ఫిర్యాదు చేసినా స్పందించని కూటమి సర్కారు..
విజయవాడ ఎంపీ చిన్ని అండదండలతోనే అంతా..
రూ.350 కోట్ల మట్టి దోపిడీపై సీఎంకు మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అధికారంలోకి రాగానే ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలకు పంచి పెడుతూ.. ఇసుక నుంచి మట్టి దాకా అన్నింటినీ ఆదాయ వనరుగా మార్చుకుని బంధుగణానికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముఖ్యనేత పోలవరంలో మరో దోపిడీకి పచ్చ జెండా ఊపారు! ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో బరి తెగించిన పచ్చ ముఠాలు పోలవరం కాలువను కుళ్లబొడుస్తూ లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాయి. వేలాది టిప్పర్ల మట్టిని విక్రయిస్తూ పోలవరం కుడి ప్రధాన కాలువ గట్లను గుల్ల చేస్తున్నారు. కాలువకు రక్షణగా ఉన్న ప్రధాన గట్లను (బండ్స్) కూడా వదలకుండా రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో తవ్వేస్తూ నిత్యం వేలాది లారీల మట్టిని తరలించి జేబులు నింపుకొంటున్నారు. విజయవాడకు కూతవేటు దూరంలో సీఎం చంద్రబాబు నివాసానికి అత్యంత చేరువలో కేజీఎఫ్ గనులను తలదన్నేలా ఈ మట్టి దందా సాగుతుండటం గమనార్హం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి పరిసరాల్లో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలతో కాలువ గట్లు బలహీనపడి వరద ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. బెజవాడను బుడమేరు ముంచెత్తిన రీతిలో.. ఇక్కడ కాలువ గట్లు తెగితే విజయవాడ రూరల్, జి.కొండూరు ఇబ్రహీంపట్నంలో లోతట్టు ప్రాంతాలు ముంపు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యనేత కనుసన్నల్లో జరుగుతున్న పోలవరం కాలువలో మట్టి దందా ఇలా ఉంది..!
మట్టి గుట్టలు మాయం..
పోలవరం కుడి ప్రధాన కాలువ మట్టిని మింగేసేందుకు ముఖ్యనేత డైరెక్షన్లో టీడీపీ పార్లమెంట్ ప్రజాప్రతినిధి పక్కా స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) అవసరాల కోసం పోలవరం కాలువ 167.040 కిలోమీటరు వద్ద 4,908 క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే తవ్వేందుకు అనుమతులు పొందారు. నిబంధనల ప్రకారం మట్టి తవ్వకాలు పరిమితంగా పగటి పూట మాత్రమే చేపట్టాలి. దీనికి విరుద్ధంగా రోజు భారీ యంత్రాలతో రేయింబవళ్లు కాలువ గట్లను ఛిద్రం చేసి వేలాది లారీల మట్టిని అక్రమంగా తరలించారు. అడ్డగోలు తవ్వకాలపై సామాజిక కార్యకర్త జమలయ్య ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో ఆధారాలతో ఫిర్యాదు చేశారు. జీపీఎస్ మ్యాపింగ్ ఫొటోలతో నీటి పారుదలశాఖ అధికారుల దృష్టికి సైతం తెచ్చినా స్పందించలేదు. ఒక్క అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. దీంతో మరింత బరి తెగించి పోలవరం కుడికాలువ 166 కి.మీ. నుంచి 168 కి.మీ. వరకు రెండు కిలోమీటర్ల మేర కాలువకు ఇరువైపులా గట్లను తవ్వడంతో భారీ మట్టి గుట్టలు మాయమయ్యాయి. కొన్ని చోట్ల బండ్ను మాయం చేశారు. దీంపాటు ఇదే ప్రదేశంలో కాలువ గట్టుకు సమీపంలో ఉన్న దండ తిప్పలు కొండలను సైతం బాంబులతో పెకిలించి గ్రావెల్ను తరలిస్తున్నారు.
రూ.350 కోట్ల మట్టి దందా!
– సీఎంకు మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ
మట్టి దందాకు అండదండలు అందిస్తున్న విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్నిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఎంపీ కేశినేని నాని (శ్రీనివాస్) సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. విజయవాడ రూరల్ పరిధిలోని పోలవరం కుడి ప్రధాన కాలువ రక్షణ గట్లను, బుడమేరు డైవర్షన్ కాలువ(బీడీసీ) పరిసరాల్లోని ప్రభుత్వ సంపదను కొల్లగొట్టి ఎంపీ కేశినేని చిన్ని రూ.350 కోట్లు పోగేశారని ఆరోపించారు. పదవిని, ప్రభుత్వ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని ఒక పెద్ద బినామీ నెట్వర్క్ ద్వారా ఈ దోపిడీకి తెర తీసినట్లు పేర్కొన్నారు. మట్టి మాఫియా ఆర్థిక లావాదేవీల కీలక చర్చలన్నీ విజయవాడ గురునానక్ కాలనీ ‘రావూరి విస్టా’ అపార్ట్మెంట్ ప్లాట్ నంబర్ 301 కేంద్రంగా సాగినట్లు వెల్లడించారు.
అక్కడ తక్షణమే దాడులు నిర్వహించి సోదాలు చేస్తే ఈ కుంభకోణానికి సంబంధించి తిరుగులేని సాక్ష్యాధారాలు లభ్యమవుతాయని స్పష్టం చేశారు. కేవలం ఐదు వేల క్యూబిక్ మీటర్ల తవ్వకానికి అనుమతి పొంది ఏకంగా రెండు లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టిని కాలువ గట్ల నుంచి తవ్వేందుకు వ్యూహం రచించారని తెలిపారు. జేసీబీలు, పొక్లెయిన్లతో రాత్రింబవళ్లు తవ్వకాలు జరిపించారన్నారు. వందలాది టిప్పర్ల మట్టిని అమరావతిలో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా తరలించి విక్రయించారని చెప్పారు. ఎలాంటి అనుమతులు, వే బిల్లులు లేకుండా మైనింగ్ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐతో విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
మైలవరంలో మట్టి, ఇసుక, గ్రావెల్ దందాపై ఫిర్యాదు
మైలవరం నియోజకవర్గంలో టీడీపీ ప్రజాప్రతినిధి మట్టి, ఇసుక, గ్రావెల్ దందాపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు మాజీ మంత్రి జోగి రమేష్ సోమవారం గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు.
సహజ వనరుల లూటీ
రాజధాని నిర్మాణం ముసుగులో టీడీపీ నేతలు అమరావతిని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. మట్టి, ఇసుక, గ్రావెల్, బూడిద, సహజ వనరులన్నింటిని దోచేస్తున్నారు. పోలవరం గట్లను సైతం మాయం చేస్తున్నారు. నామమాత్రంగా అనుమతులు తీసుకుని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అక్రమంగా తవ్వేసి వందల కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారు. ఈ మట్టి దోపిడీ కేజీఎఫ్–3 సినిమాను తలపిస్తోంది. యథేచ్ఛగా మట్టి దోచేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. మట్టి దోపిడీపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలి.
– జోగి రమేష్, మాజీ మంత్రి


