
అదే లక్ష్యంగా కూటమి సర్కారు కక్ష సాధింపు
గ్రామీణ బాలికలకు ఉన్నత విద్య అందకుండా వ్యూహాత్మక కుట్ర
ఇందులో భాగంగా హైసూ్కల్ ప్లస్ (ఇంటర్ విద్య)కు ఎసరు
వాటిని రద్దు చేసేందుకు నిర్వీర్యం
వీటిలో పని చేస్తున్న దాదాపు 1,000 మంది స్కూల్ అసిస్టెంట్ల బదిలీ
తిరిగి ఆయా ఖాళీలను అడ్మిషన్ల అనంతరం కూడా భర్తీ చేయని విద్యా శాఖ.. పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థుల అగచాట్లు
ఫలితంగా పిల్లలంతా ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకు వెళ్లేలా స్కెచ్
గత ప్రభుత్వ విద్య సంస్కరణలన్నీ రద్దు..
నాడు–నేడు, డిజిటల్ క్లాస్ రూమ్లు, సబ్జెక్ట్ టీచర్లు, టోఫెల్ క్లాసులు, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, ఐబీ, ట్యాబులకు మంగళం
గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో మండలానికి ఒక హైసూ్కల్ ప్లస్ ఏర్పాటు.. ఇందులో బాలికల కోసం ప్రత్యేకంగా 294 కేటాయింపు
గత శాసనసభ సమావేశాల్లో హైస్కూల్ ప్లస్(ఇంటర్)లలో ప్రవేశాల్లేవని.. ఫలితాలు రావడం లేదని, వాటిని రద్దు చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేశ్ సెలవిచ్చారు. ఈ నెపంతో టీడీపీ కూటమి ప్రభుత్వం పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్)లు రిటైరైన చోట కొత్త వారిని నియమించలేదు. ఇప్పుడు తాజా బదిలీల్లోనూ ఇక్కడ పని చేస్తున్న పీజీటీలను బదిలీ చేశారేగానీ, వారి స్థానంలో కొత్త వారి నియామకాలు చేపట్టలేదు. ఈ స్కూళ్లు విజయవంతమవుతుండటంతో వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బాలికల విద్యను భ్రష్టుపట్టిస్తోంది. గ్రామీణ బాలికలకు స్థానికంగా ఇంటర్ విద్యను అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్లను వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేస్తోంది. మండలానికి రెండు జూనియర్ కాలేజీలు ఉండాలన్న లక్ష్యంతో 2022లో రెండు విడతల్లో 504 హైస్కూల్ ప్లస్లను ప్రారంభించగా, వాటిలో ఒకటి బాలికల కోసం, మరొకటి కో–ఎడ్యుకేషన్ విధానంలో అందుబాటులోకి తెచ్చారు.
అయితే, వైఎస్ జగన్పై అక్కసుతో నాటి ప్రభుత్వంలోని విద్యా సంస్కరణలను ఒకొక్కటిగా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తోంది. ఇందులో భాగంగా హైస్కూల్ ప్లస్ల్లో పని చేస్తున్న పీజీటీలను ఇటీవల బదిలీల్లో బయటకు పంపి, వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టలేదు. దీంతో ఆయా స్కూళ్లల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
జీఓ నంబర్ 117 రద్దులో భాగంగా హైస్కూల్ ప్లస్లను రద్దు చేస్తామని విద్యా శాఖ మంత్రి ప్రకటించారు. ఈ జీఓ ఉపసంహరణ మార్గదర్శకాలు, ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే, కూటమి ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో హైస్కూల్ ప్లస్లను ఇంటర్మీడియట్ బోర్డుకు అప్పగిస్తామని ఒకసారి.. కాంట్రాక్టు టీచర్లను నియమిస్తామని మరోసారి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ దిశగా కూడా చర్యలు తీసుకోక పోవడం చూస్తుంటే వీటిని నిర్వీర్యం చేసి.. ఎత్తేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఇట్టే తెలుస్తోంది.
కుట్రలో కీలక అడుగు
⇒ నిజానికి.. రాష్ట్రంలోని 294 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్గా గత ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. రెండో విడతలో మరో 210 హైస్కూళ్లతో కలిపి మొత్తం 504 హైస్కూల్ ప్లస్లను అందుబాటులోకి తెచ్చింది. అలాగే, కేజీబీల్లో సైతం ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. 2022–23 విద్యా సంవత్సరంలో 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి.
⇒ వీటిల్లోని విద్యార్థుల ఇంటర్ తరగతుల బోధనకు సీనియర్ స్కూల్ అసిస్టెంట్లు 1,850 మందిని పీజీటీలుగా నియమించింది. ఇప్పుడు వీరిలో సగం కంటే ఎక్కువ మందిని కూటమి ప్రభుత్వం బదిలీ చేసి, వారి స్థానంలో ఎవరినీ నియమించకుండా తన కుట్రలో కీలక అడుగు వేసింది. దీంతో ఈ ఏడాది హైస్కూల్ ప్లస్ల్లో చేరిన విద్యార్థులకు బోధనా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఉపాధ్యాయుల బదిలీల్లోనూ వాటిల్లో ప్రభుత్వం పీజీటీలను కేటాయించక పోవడంతో అక్కడ బోధన కుంటుబడింది. ఫలితంగా పిల్లలంతా ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకు వెళ్లేలా ప్రభుత్వమే వెనుక ఉండి తతంగం నడిపిస్తుండటం దుర్మార్గానికి పరాకాష్ట.
⇒ శ్రీకాకుళం జిల్లాలోని రొట్టవలస హైస్కూల్ ప్లస్లో మ్యాథ్స్, బోటనీ, జువాలజీ పీజీటీలు పదోన్నతిపై ఇతర స్కూళ్లకు బదిలీ అయ్యారు. హరిపురం హైస్కూల్ ప్లస్లోని జువాలజీ పీజీటీ ఏడాది క్రితం రిటైరైనా ఇప్పటిదాకా నియమించలేదు. ఉర్లాం హైస్కూల్ ప్లస్లో నాలుగు పీజీటీ ఖాళీలను భర్తీ చేయలేదు. చిత్తూరు జిల్లాలో 10 హైస్కూల్ ప్లస్లలో 35 పోస్టులు ఏడాది కాలంగా ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులున్నా హైస్కూల్ ప్లస్లను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందనడానికి ఇలాంటి ఉదాహరణలు ప్రతి మండలంలోనూ కనిపిస్తున్నాయి.
విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం
⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సమూల విద్యా సంస్కరణలు ఇతర రాష్ట్రాల ప్రశంసలు పొందాయి. స్వాతంత్య్రం అనంతరం ఎవరూ చేయని స్థాయిలో విద్యా రంగంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తద్వారా నాణ్యమైన విద్యను పేద పిల్లల ముంగిటకు తెచ్చారు. పోటాపోటీ చేరికలతో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపు దిద్దుకున్నాయి. ఫలితంగా నాడు సర్కారీ బడుల్లో ఖాళీలు లేక.. ‘నో వేకెన్సీ’ బోర్డులు దర్శనమివ్వడం చూశాం. ఎన్నో జాగ్రత్తలతో విద్యార్థుల యూనిఫాం కిట్ పంపిణీ చేశారు.
⇒ ఇప్పుడివన్నీ గతం. గత ప్రభుత్వంలో విజయవంతంగా అమలైన విద్యా సంబంధిత పథకాలు, కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. పాఠశాలల్లో నాడు–నేడు అభివృద్ధి పనులు అటకెక్కాయి. ఇంగ్లిష్ మీడియంకు మంగళం పాడింది. డిజిటల్ క్లాస్ రూమ్లు, టోఫెల్ క్లాసులకు టాటా చెప్పింది. సబ్జెక్ట్ టీచర్లపై వేటు వేసింది. గోరుముద్దను ఘోరంగా మార్చింది. సీబీఎస్ఈ సిలబస్, ఐబీ, ట్యాబులు అక్కర్లేదంది.
⇒ దీంతో ఫలితాలు పడిపోయాయి. ఫలితంగా ప్రభుత్వ బడులను వీడి విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారు. తద్వారా ప్రైవేటు యాజమాన్యాలకు మేలుచేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని ఇట్టే తెలిసిపోయింది.
ప్రభుత్వ చదువులపై విశ్వాసం పోతోంది
గత ప్రభుత్వం గ్రామీణ పేద విద్యార్థుల కోసం హైస్కూల్ ప్లస్ పేరిట ఇంటర్ విద్యను అందుబాటులోకి తెచ్చింది. అవి బాగా విజయవంతమయ్యాయి.
కానీ, కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ నిర్వీర్యమవుతున్నాయి. వీటిల్లో బోధనకు పీజీటీల్లేరు. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు అభద్రతాభావనకు లోనై ప్రభుత్వ చదువులపై విశ్వాసం కోల్పోతున్నారు. హైస్కూల్ ప్లస్లను ప్రభుత్వం కొనసాగిస్తుందో లేదో తేల్చాలి. పీజీటీ ఖాళీలను అర్హతగల స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేయాలి.
– వి.రెడ్డి శేఖర్రెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్