-
UPSC Results 2024: టాపర్స్
ఆకాశంలో సగం అని చాటడం వేరు.. నిరూపించడం వేరు. నేటి అమ్మాయిలు చదువులో, మేధలో, సమర్థమైన అవకాశాలు అందుకోవడంలో తమ ఆకాశం సగం అని నిరూపిస్తున్నారు. యు.పి.ఎస్.సి. 2023 టాప్ 25 ర్యాంకుల్లో 10 మంది అమ్మాయిలు ఉన్నారు. మన తెలుగు అమ్మాయి అనన్య (3), రుహానీ (5), సృష్టి (6), అన్ మోల్ రాథోడ్ (7), నౌషీన్ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10), మేధా ఆనంద్ (13), స్వాతి శర్మ (17), వార్దా ఖాన్ (18), రితికా వర్మ (25). వీరిలో అనన్య, సృష్టి, వార్దా ఖాన్ల కథనాలు ఇప్పటికే అందించాం. మిగిలిన ఏడుగురు ప్రతిభా పరిచయాల గురించిన ఈ కథనం. ‘స్వయం సమృద్ధి, ‘ఆర్థిక స్వాతంత్య్రం’, ‘నిర్ణయాత్మక అధికారిక పాత్ర’, ‘పరిపాలనా రంగాల ద్వారా జనావళికి సేవ’, ‘సామర్థ్యాలకు తగిన స్థానం’, ‘లక్ష్యాలకు తగిన సామర్థ్యం’... ఇవీ నేటి యువతుల విశిష్ట ఆకాంక్షలు, అభిలాషలు, లక్ష్యాలు. అందుకే దేశంలో అత్యంత క్లిష్టతరమైన సివిల్స్ ప్రవేశ పరీక్షల్లో వీరు తలపడుతున్నారు. గెలుస్తున్నారు. నిలుస్తున్నారు. యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో టాప్ 25లో పది ర్యాంకులు అమ్మాయిలు సాధించడం గర్వపడాల్సిన విషయం. మొత్తం 1016 మంది అభ్యర్థులు ఎంపిక కాగా వీరిలో అమ్మాయిలు 352 మంది ఉండటం ముందంజను సూచిస్తోంది. తల్లిదండ్రులకు భారం కాకుండా ఒకవైపు ఉద్యోగాలు చేస్తూ లేదా ఇంటి దగ్గర చదువుకుంటూ వీరిలో చాలామంది ర్యాంకులు సాధించారు. మహబూబ్నగర్కు చెందిన అనన్య రెడ్డి టాప్ 3 ర్యాంక్ సాధించి తెలుగు కీర్తి రెపరెపలాడించింది. కోచింగ్ సెంటర్ల మీద ఆధారపడకుండా సొంతగా చదువుకోవడం ఒక విశేషమైతే, మొదటి అటెంప్ట్లోనే ఆమె భారీ ర్యాంక్ సాధించడం మరో విశేషం. అలాగే ఢిల్లీకి చెందిన సృష్టి దమాస్ 6వ ర్యాంక్, వార్దా ఖాన్ 18వ ర్యాంక్ సాధించి స్ఫూర్తిగా నిలిచారు. మిగిలిన ఏడుగురు విజేతల వివరాలు. రుహానీ (5వ ర్యాంకు) హర్యానాకు చెందిన రుహానీ హర్యానాలోని గుర్గావ్లోనూ ఢిల్లీలోనూ చదువుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ లెక్చరర్లు. ఎకనమిక్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన రుహానీ ‘ఇగ్నో’ నుంచి ΄ోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. 2020లో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్కు ఎంపికయ్యి నీతి ఆయోగ్లో మూడేళ్లు పని చేసింది. కాని ఐ.ఏ.ఎస్ కావడం ఆమె లక్ష్యం. మరో అటెంప్ట్లో ఆమె ఐ.పి.ఎస్.కు ఎంపికయ్యింది. హైదరాబాద్లో శిక్షణ ΄÷ందుతూ ఆఖరుసారిగా 6వ అటెంప్ట్లో టాప్ ర్యాంక్ సాధించింది. పేద వర్గాల ఆర్థిక స్థితిని మెరుగు పర్చడం తన లక్ష్యం అంటోంది రుహానీ. అన్మోల్ రాథోడ్ (7వ ర్యాంకు) జమ్ము నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉద్రానా అనే మారుమూల పల్లె అన్మోల్ది. తండ్రి బ్యాంక్ మేనేజర్, తల్లి ప్రిన్సిపాల్. ఇంటర్ వరకూ జమ్ములో చదువుకున్నా గాంధీనగర్లో బి.ఏ.ఎల్.ఎల్.బి. చేసింది. 2021లో చదువు పూర్తయితే అదే సంవత్సరం సివిల్స్ రాసింది. కాని ప్రిలిమ్స్ దాటలేక΄ోయింది. 2022లో మళ్లీ ప్రయత్నిస్తే 2 మార్కుల్లో ఇంటర్వ్యూ వరకూ వెళ్లే అవకాశం ΄ోయింది. 2023లో మూడవసారి రాసి 7వ ర్యాంక్ ΄÷ందింది. అయితే ఈలోపు ఆమె ‘జమ్ము కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్’ ΄ోటీ పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికైంది. ఆ ఉద్యోగ శిక్షణ తీసుకుంటూనే సివిల్స్ సాధించింది.‘రోజుకు ఎనిమిది గంటలు చదివాను. చిన్నప్పటి నుంచి నాకు తగాదాలు తీర్చడం అలవాటు. రేపు కలెక్టర్ను అయ్యాక ప్రజల సమస్యలను తీరుస్తాను’ అంటోందామె. నౌషీన్ (9వ ర్యాంకు) ‘మాది ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్. కాని ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల అక్కడి విద్యార్థుల రాజకీయ, సామాజిక అవగాహన స్థాయి నన్ను ఆశ్చర్యపరిచి సివిల్స్ రాసేలా పురిగొల్పింది. 2020 నుంచి ప్రయత్నించి నాలుగో అటెంప్ట్లో 9వ ర్యాంక్ సాధించాను. చరిత్రలో ఈ రెండు ఘటనలు జరగక΄ోయి ఉంటే బాగుండేదని వేటి గురించి అనుకుంటావ్ అంటూ నన్ను ఇంటర్వ్యూలో అడిగారు– రెండు ప్రపంచ యుద్ధాలు జరక్క΄ోయి ఉంటే బాగుండేదని, ఆసియా–ఆఫ్రికా దేశాలు వలసవాద పాలన కిందకు రాకుండా ఉంటే బాగుండేదని చె΄్పాను. నా జవాబులు బోర్డ్కు నచ్చాయి’ అని తెలిపింది నౌషీన్. ‘ఐ.ఏ.ఎస్. ఆఫీసర్గా పని చేయడం గొప్ప బాధ్యత. చాలా మంది జీవితాల్లో మార్పు తేవచ్చు’ అందామె. ఐశ్వర్యం ప్రజాపతి (10వ ర్యాంకు) లక్నోకు చెందిన ఐశ్వర్యం ప్రజాపతి రెండో అటెంప్ట్లో 10వ ర్యాంక్ సాధించింది. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉత్తరాఖండ్’లో చదువుకున్న ఐశ్వర్యం ఒక సంవత్సరం పాటు విశాఖపట్నం ఎల్ అండ్ టిలో ట్రయినీగా పని చేసింది. ‘నేను ఇన్ని గంటలు చదవాలి అని లెక్కపెట్టుకోని చదవలేదు. చదివినంత సేపు నాణ్యంగా చదవాలి అనుకున్నాను. నన్ను కలెక్టర్గా చూడాలన్నది మా అమ్మానాన్నల కల. సాధిస్తానని తెలుసుకాని ఇంత మంచి ర్యాంక్ వస్తుందనుకోలేదు. ఎవరైనా సరే తమకు ఏది నచ్చుతుందో ఆ దారిలో వెళ్లినప్పుడే సాధించాలన్న మోటివేషన్ వస్తుంది’ అని తెలిపిందామె. మేధా ఆనంద్ (13వ ర్యాంకు) ‘మా అమ్మ ఆగ్రాలో బ్యాంక్ ఉద్యోగం చేస్తుంది. కలెక్టర్ ఆఫీసు మీదుగా వెళ్లినప్పుడల్లా నా కూతురు కూడా ఒకరోజు కలెక్టర్ అవుతుంది అనుకునేది. నాతో అనేది. నా లక్ష్యం కూడా అదే. కాలేజీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి సివిల్స్ రాయాలని తర్ఫీదు అయ్యాను. సెకండ్ అటెంప్ట్లో 311వ ర్యాంక్ వచ్చింది. కాని నేను సంతృప్తి చెందలేదు. ప్రస్తుతం నేను నార్త్ రైల్వేస్లో పని చేస్తున్నాను. పని చేస్తూనే 50 లోపు ర్యాంక్ కోసం కష్టపడ్డాను. కాని 13వ ర్యాంక్ వచ్చింది. నేటి మహిళల్లోని సామర్థ్యాలు పూర్తిగా సమాజానికి ఉపయోగపడటం లేదు. వారికి ఎన్నో అడ్డంకులున్నాయి. వాటిని దాటి వారు ముందుకు రావాలి. కలెక్టర్ అయ్యాక నేను స్త్రీలు ముఖ్యభూమికగా ఆర్థిక వికాసం కోసం కృషి చేస్తాను’ అని తెలిపింది మీరట్కు చెందిన మేధా ఆనంద్. స్వాతి శర్మ (17వ ర్యాంకు) జెంషడ్పూర్కు చెందిన స్వాతి శర్మ తను సాధించిన 17 ర్యాంక్తో జార్ఖండ్లో చాలామంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తానని భావిస్తోంది. ‘మా రాష్ట్రంలో అమ్మాయిలకు ఇంకా అవకాశాలు దొరకాల్సి ఉంది’ అంటుందామె. అంతేకాదు కలెక్టరయ్యి దిగువ, గిరిజన వర్గాల మహిళల అభ్యున్నతికి పని చేయాలనుకుంటోంది. ‘ఎం.ఏ. ΄÷లిటికల్ సైన్స్ చదివాను. ఆ చదువే ఐ.ఏ.ఎస్. చదవమని ఉత్సాహపరిచింది. ఢిల్లీలో సంవత్సరం ఆరు నెలలు కోచింగ్ తీసుకున్నాను. రెండు మూడుసార్లు విఫలమయ్యి నాకు నేనే తర్ఫీదు అయ్యి ఇప్పుడు 17వ ర్యాంక్ సాధించాను. మా నాన్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, అమ్మ గృహిణి. బాగా చదువుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే పిల్లలు తల్లిదండ్రులకిచ్చే కానుక’ అంది స్వాతి శర్మ. రితికా వర్మ (25వ ర్యాంకు) ‘ఎన్నో సమస్యలున్న బిహార్ రాష్ట్రం కోసం పని చేయాల్సింది చాలా ఉంది. మాది పాట్నా. మా నాన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో మేనేజర్. ప్రస్తుతం మేము గుంటూరులో ఉంటున్నాం. ఢిల్లీలో బిఎస్సీ మేథ్స్ చదివిన నేను సివిల్స్ ద్వారా పేదల కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. నాకు సాహిత్యం అంటే ఆసక్తి ఉంది. బిహార్లో పేదలకు భూమి సమస్య, పని సమస్య ఉన్నాయి. తక్కువ వేతనాల వల్ల పల్లెల నుంచి నిరవధికంగా వలస సాగుతోంది. కలెక్టర్గా నేను వీరి కోసం పని చేయాలనుకుంటున్నాను’ అని తెలిపింది రితికా వర్మ. -
విద్యాప్రవీణ
మద్యానికి బానిసై తండ్రి చనిపోయాడు. కష్టాల మధ్య పెరిగిన ప్రవీణ పశువుల కాపరిగా పనిచేసింది. కూలిపనులు చేసింది. చదువు ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఆ ఆత్మవిశ్వాసమే ప్రవీణను 23 సంవత్సరాల వయసులో సర్పంచ్ని చేసింది. బాలికల విద్య నుంచి స్త్రీ సాధికారత వరకు ఎన్నో విషయాలపై స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తోంది ప్రవీణ. రాజస్థాన్లోని పలి జిల్లా సగ్దార గ్రామానికి చెందిన ప్రవీణ తన గ్రామంలోనే కాదు చుట్టుపక్కల ఎన్నో గ్రామాల ప్రజలకు స్ఫూర్తిదాయక మహిళగా మారింది. మూడోక్లాసులో ఉన్నప్పుడు ప్రవీణను చదువు మానిపించారు. దీంతో తనకు ఇష్టమైన చదువుకు దూరం అయింది. చదువుకు దూరం అయిన ప్రవీణ పశువులను మేపడం నుంచి కూలిపనుల వరకు ఎన్నో చేసింది. రెండు సంవత్సరాల తరువాత ఆమె జీవితాన్ని మార్చే సంఘటన జరిగింది. తమ ఊరికి నలభై కిలోమీటర్ల దూరం లో ఉన్న గ్రామంలోని రెసిడెన్షియల్ స్కూల్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ (కేజీబీవి)లో చదువుకునే అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. అయితే మొదట్లో కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ఒక ఫీల్డ్ వర్కర్ కృషివల్ల ఎట్టకేలకు బడిలో ప్రవీణను చేర్పించడానికి ఒప్పుకున్నారు. స్కూల్ చదువు వల్ల ఆత్మవిశ్వాసం పెరగడం మాత్రమే కాదు, ఆడపిల్లలు చదువుకోవడం వల్ల ఎంత మేలు జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోగలిగింది ప్రవీణ. చదువు పూర్తయిన తరువాత ఒక కన్స్ట్రక్షన్ వర్కర్తో ప్రవీణ పెళ్లి జరిగింది. ‘చదువుకున్న అమ్మాయి’గా అత్తగారి ఇంట్లో ప్రవీణకు తగిన గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. తాను తీసుకునే నిర్ణయాలకు అండగా నిలబడేవారు. ‘సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్నాను’ అన్నప్పుడు అందరూ అండగా నిలబడ్డారు. కొంతమంది మాత్రం వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. అయితే అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లింది. సర్పంచ్గా విజయం సాధించింది. చదువు విలువ తెలిసిన ప్రవీణ సర్పంచ్ అయిన రోజు నుంచి బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇంటింటికి వెళ్లి చదువుకోవడం వల్ల ఆడపిల్లలకు కలిగే ఉపయోగాల గురించి ప్రచారం చేసేది. బాల్యవివాహాలు జరగకుండా అడ్డుకునేది. ‘అప్పుడెప్పుడో మా అమ్మాయిని చదువు మానిపించాం. ఇప్పుడు తిరిగి బడిలో చేర్చాలనుకుంటున్నాం’ అంటూ ఎంతోమంది తల్లిదండ్రులు ప్రవీణ సలహాల కోసం వచ్చేవారు. సర్పంచ్గా ఆడపిల్లలకు ప్రత్యేకంగా స్కూలు కట్టించింది ప్రవీణ. బాలికల విద్య కోసం పనిచేస్తున్న సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ప్రవీణ ఏదైనా గ్రామానికి వెళ్లినప్పుడు ఉపాధ్యాయులు తమ స్కూలుకు తీసుకువెళ్లి ఆడపిల్లలకు పరిచయం చేసేవారు. ‘చదువుకోకపోతే ప్రవీణ కూలిపనులు చేస్తూ ఉండిపోయేది. చదువుకోవడం వల్ల ఆమెలో ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆ ఆత్మవిశ్వాసమే ప్రవీణను సర్పంచ్ను చేసి పదిమందికి ఉపయోగపడే మంచి పనులు చేసేలా చేసింది. మీరు బాగా చదువుకుంటే సర్పంచ్ మాత్రమే కాదు కలెక్టర్ కూడా కావచ్చు’... ఇలాంటి మాటలు ఎన్నో చెప్పేవారు. ఆడపిల్లల చదువు కోసం పనిచేస్తున్న‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థ తమ ప్రచార చిత్రాలలో ప్రవీణ ఫొటోలను ఉపయోగించుకుంటుంది. దీంతో ఎన్నో గ్రామాలకు ఆమె సుపరిచితం అయింది. ‘ఏదైనా గ్రామానికి వెళ్లినప్పుడు స్కూల్లో చదివే అమ్మాయిలతో మాట్లాడుతుంటాను. మీ గురించి ఫీల్డ్ వర్కర్స్ మా పేరెంట్స్కు చెప్పి స్కూల్కు పంపించేలా ఒప్పించారు... అని ఎంతోమంది అమ్మాయిలు అన్నప్పుడు గర్వంగా అనిపించేది. ఆడపిల్లల విద్యకు సంబంధించి భవిష్యత్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాను’ అంటుంది ప్రవీణ. -
Safeena Husain: ఆర్మీ ఆఫ్ జెండర్ చాంపియన్స్
పేదరికంలో పుట్టిన దిల్లీకి చెందిన సఫీనా హుసేన్ చదువును నమ్ముకొని ఉన్నత స్థాయికి చేరింది. లండన్లో చదువుకున్న సఫీనా అమెరికాలో ఉద్యోగం చేసింది. ఆ తరువాత మన దేశానికి తిరిగి వచ్చి పేదింటి ఆడపిల్లలు బడి బాట పట్టడానికి ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. ఎన్నో రాష్ట్రాలలో వేలాదిమంది ఆడపిల్లలు చదువుకోగలిగేలా చేసింది. తాజాగా... ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో కృషి చేస్తున్న వారికి ‘వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఫర్ ఎడ్యుకేషన్, ఖతర్’ వారు ఇచ్చే ‘వైజ్’ప్రైజ్కు ఎంపికైంది. ఈ ప్రైజుకు ఎంపికైన ఫస్ట్ ఇండియన్ సఫీనా హుసేన్ గురించి... ‘అబ్బాయిని స్కూలుకు పంపిస్తున్నారు కదా. మరి అమ్మాయిని ఇంటిపనులకే పరిమితం చేస్తున్నారేమిటి?’ అని అడిగినప్పుడు ఆ ఇంటిపెద్ద నవ్వుతూ ఇచ్చిన సమాధానం.... ‘ఆడపిల్లలకు చదువెందుకు. ఏదో ఒకరోజు పెళ్లి చేయాల్సిందే కదా’ ఇంచుమించు ప్రతి ఇంటి నుంచి ఇలాంటి సమాధానమే వినిపించింది. ‘ఆడపిల్లలకు విద్య’ అనే నినాదం ప్రాధాన్యతకు నోచుకోని ఎన్నో ప్రాంతాలను చూసింది సఫీనా. దీనికి పేదరికం ఒక కారణం అయితే, ఆర్థికస్థాయి బాగున్నా ‘ఆడపిల్లకు చదువెందుకు’ అనే నిర్లిప్తత మరోకారణం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటి ఆడపిల్ల బడికి వెళ్లాలనే లక్ష్యంతో ‘ఎ డ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది సఫీనా. ‘ఒక సమస్య గురించి మాట్లాడేటప్పుడు దానితో మమేకం కావాలి’ అంటున్న సఫీనాకు పేదరికం అనేది అపరిచిత సమస్య కాదు. దిల్లీలోని ఒక పేదకుటుంబంలో పుట్టింది. ఎన్నో కష్టాల మధ్య కూడా ‘చదువు’ అనే ఆయుధాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆ కుటుంబం నుంచి లండన్లో చదువుకున్న తొలి వ్యక్తి అయింది. లండన్ నుంచి అమెరికాకు వెళ్లి స్వచ్ఛంద సేవారంగంలో పని చేసిన సఫీనా 2005లో స్వదేశానికి తిరిగి వచ్చింది. ‘చదువుకోవడం వల్ల నేను ఎంతో సాధించాను. దేశదేశాలు తిరిగాను. చదువుకోకపోతే నా పరిస్థితి ఊహకు కూడా అందనంత దయనీయంగా ఉండేది’ అనుకున్న సఫీనా హుసేన్ పేదింటి ఆడపిల్లల చదువు కోసం తన వంతుగా ఏదైనా చేయాలనుకుంది. ప్రభుత్వ సంస్థల నుంచి వివరాలు సేకరించింది. చదువుకు సంబంధించి జెండర్–గ్యాప్ ఉన్న 26 జిల్లాల గురించి తెలుసుకుంది. అందులో తొమ్మిది రాజస్థాన్లో ఉన్నాయి. రాజస్థాన్లో ఆడపిల్లల చదువుకు దూరంగా ఉన్న ప్రాంతాలను మొదట ఎంపిక చేసుకుంది సఫీనా బృందం. గ్రామానికి చెందిన స్వచ్ఛంద సేవకులతో ‘ఆర్మీ ఆఫ్ జెండర్ చాంపియన్స్’ను ఏర్పాటు చేసి ‘దయచేసి మీ అమ్మాయిని స్కూల్కు పంపించండి’ అంటూ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ‘ఆడపిల్లలకు చదువు’ అనే అంశంపై గ్రామ సమావేశాలు ఏర్పాటు చేశారు. సఫీనా ఆమె బృందం కృషి వృథా పోలేదు. ఎన్నో గ్రామాల్లో ఎంతోమంది ఆలోచన తీరులో మార్పు వచ్చింది. తమ ఇంటి ఆడపిల్లలను స్కూలుకు పంపించడం ప్రారంభించారు. చాలా బడులలో ఆడపిల్లల కోసం టాయిలెట్ సదుపాయాలు లేవు. అలాంటి బడులలో ప్రత్యేక టాయిలెట్లు నిర్మించేలా చేశారు. బడిలో అకాడమిక్ పాఠాలు మాత్రమే కాకుండా లైఫ్స్కిల్స్కు సంబంధించిన పాఠాలు కూడా చెప్పేవారు. ‘ఆడపిల్లలకు చదువు దూరం కావడం అనేది ఆర్థిక సమస్యతో ముడిపడి ఉన్న అంశం కాదు. అది పితృస్వామిక భావజాలానికి సంబంధించింది. మేము పనిచేసిన కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఇంటి ఆడపిల్ల కంటే గొర్రెలు, మేకలను విలువైన ఆస్తిగా భావించడం చూశాం. ముందు వారి ఆలోచన తీరులో మార్పు తీసుకు రావాలనుకున్నాం. అది అంత తేలిక కాదని తెలిసినా రంగంలోకి దిగాం. ప్రభుత్వ సంస్థల నుంచి లోకల్ వాలెంటీర్స్ వరకు కలిసి పనిచేశాం. అయితే మేము నిరాశతో వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి రాలేదు’ అంటుంది సఫీనా. ‘ఆడపిల్లలకు చదువు అందని ప్రాంతాలు ఏమిటి?’ అనే అంశంపై ఒకప్పుడు ప్రభుత్వ సంస్థల డాటాపైన ఆధారపడిన సఫీనా బృందం ఇప్పుడు డాటా ఎనాలటిక్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలాంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. జియో–ట్యాగ్డ్ టార్గెట్ విలేజెస్ నుంచి మొబైల్ ఫోన్స్లో డాటా సేకరిస్తున్నారు. తమ పనితీరును మరింత మెరుగుపరుచుకొని ఉత్తమఫలితాలు సాధించడానికి వారికి ఇది ఉపయోగపడుతుంది. గతాన్ని గట్టిగా గుర్తు పెట్టుకున్న సఫీనా హుసేన్ ఎన్నో రాష్ట్రాలలో ఎంతోమంది పేదింటి అమ్మాయిల ఉజ్వల భవిష్యత్ కోసం ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ద్వారా కృషి చేస్తోంది. అయినా వెనకడుగు వేయలేదు ‘ఎడ్యుకేట్ గర్ల్స్’తో తొలి అడుగులు వేసినప్పుడు ‘మీలాగే చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు’ అని నిరుత్సాహపరిచారు కొందరు. అయితే అలాంటి మాటలను మేము సీరియస్గా తీసుకోలేదు. ‘ఫలితం వచ్చేవరకు మా ప్రయత్నం’ అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. బయటి వాళ్లు చెప్పే మాటల కంటే తమ ఊరి వాళ్లు చెప్పే మాటలకే గ్రామస్థులు ప్రాధాన్యత ఇస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో స్థానికులతో కలిసి ఆర్మీ ఆఫ్ జెండర్ ఛాంపియన్స్ను ప్రారంభించి ఆడపిల్లల విద్యకు సంబంధించి ఇంటింటి ప్రచారం నిర్వహించాం. – సఫీనా హుసేన్, ఫౌండర్, ఎడ్యుకేట్ గర్ల్స్ -
Savitribai Phule: మహిళా విద్యకు తొలి వెలుతురు
‘సావిత్రిబాయి ఫూలే ప్రతిరోజూ సంచిలో అదనంగా చీర పెట్టుకుని స్కూల్కు వెళ్లేవారు. దారిలో ఎవరో ఒకరు ఆమె మీద పేడ విసిరితే కడుక్కుని కట్టుకోవడానికి’ అని రాస్తుంది రీతా రామస్వామి గుప్తా. నిమ్న వర్గాల ఆడపిల్లల విద్యకు జీవితాన్ని అంకితం చేసిన సావిత్రిబాయి ఫూలేమీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. కాని రచయిత్రి రీతా రామస్వామి మరిన్ని జీవిత చిత్రాలను సేకరించి తెచ్చిన పుస్తకం ‘సావిత్రిబాయి పూలే’ తాజాగా విడుదలైంది. రీతా రామస్వామి గురించి, పుస్తకంలో ఉన్న విశేషాల గురించి... ‘ఇవాళ బాలికల విద్య అనగానే ప్రపంచానికి మలాలా పేరు గుర్తుకొస్తుంది. కాని బాలికల విద్య కోసం జీవితాన్ని అర్పించిన తొలి మహిళ సావిత్రిబాయి పూలే. మన దేశంలో ఆమె తొలి మహిళా ఉపాధ్యాయిని. ఆడపిల్లల చదువును ప్రచారం చేయడానికి ఆమె ఎదుర్కొన్న వ్యతిరేకత అంతా ఇంతా కాదు’ అంటుంది రీతా రామస్వామి గుప్తా. గతంలో నటుడు సంజీవ్ కుమార్పై రాసిన బయోగ్రఫీతో పాఠకులకు తెలిసిన రీతా రామస్వామి ఆ తర్వాత ‘రంగ్ దే బసంతి’ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రాతో కలిసి అతని జీవిత సంగ్రహం రాసింది. ‘ఇలా ఇంకొన్ని పుస్తకాలు రాయాలనుకుంటుండగా నా 18 ఏళ్ల కుమార్తె– అమ్మా... ఎందుకు నువ్వు ఎప్పుడూ మగవాళ్ల గురించే రాస్తావు. నువ్వు రాయదగ్గ స్త్రీలు లేరా? అని ప్రశ్నించింది. ఆ ప్రశ్న నన్ను ఆలోచింపచేసింది. దానికి జవాబే నా కొత్త పుస్తకం– సావిత్రిబాయి పూలే.. హర్ లైఫ్.. హర్ రిలేషన్షిప్స్.. హర్ లెగసీ’ అంది రీతా రామస్వామి. హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురణ సంస్థ నుంచి ఈ పుస్తకం తాజాగా విడుదలైంది. బలహీనులకు అందని విద్య ‘బ్రిటిష్ వారు 1813లో క్రైస్తవ మిషనరీల ద్వారా మన దేశంలో పాశ్చాత్య విద్యకు అంకురార్పణ చేశారు. అయితే వారి ఉద్దేశాలు వేరే. తమ వ్యవహారాల కోసం ఇంగ్లిష్ తెలిసిన కొంతమంది ఉద్యోగులు అవసరం కనుక పై వర్గాల వారికి చదువు నేర్పిస్తే వారి నుంచి కింది వర్గాల వారికి చదువు అందుతుంది అని భావించారు. కాని పై వర్గాలకు మొదలైన చదువు కింది వర్గాల వరకూ చేరలేదు. కింది వర్గాల వారికి పాఠశాలల్లో అనుమతి లేని పరిస్థితి. అంటరానితనం విస్తృతంగా ఉండేది. ఇక చదువుకు ఆడపిల్లలు నిషిద్ధం చేయబడ్డారు. ప్రభుత్వ టీచర్లకు ఇంగ్లిష్ వచ్చి ఉండాలన్న నియమం కూడా బ్రిటిష్ ప్రభుత్వం పెట్టింది. వీటన్నింటినీ దాటి సావిత్రిబాయి పూలే టీచర్ అయ్యింది. జ్యోతిబా పూలేతో కలిసి 1848లో బ్రిటిష్వారితో సంబంధం లేని, మిషనరీలతో సంబంధం లేని బాలికల తొలి పాఠశాలను మొదలెట్టింది. దిగువ వర్గాల బాలికల విద్య కోసం పోరాడింది’ అంటుంది రీతా రామస్వామి. ఆ ఇద్దరు ‘సావిత్రిబాయి పూలే హర్ లైఫ్, హర్ రిలేషన్షిప్స్, హర్ లెగసీ’... పుస్తకంలో రీతా రామస్వామి కేవలం సావిత్రిబాయి పూలే గురించే రాయలేదు. ఆమెను ఆదర్శంగా తీసుకుని బాలికల విద్య కోసం తోడైన తొలి ముస్లిం ఉపాధ్యాయిని ఫాతిమా షేక్ గురించీ... సావిత్రి, ఫాతిమా కలిసి మహరాష్ట్రలో బాలికల విద్య కోసం స్కూళ్లు స్థాపించి నిర్వహించడానికి పడిన ఆరాటం గురించి కూడా రాసింది. ‘ఫాతిమ షేక్ తొలి క్వాలిఫైడ్ ముస్లిం ఉమెన్ టీచర్ మన దేశంలో. ఆమె సావిత్రిబాయి పూలేకి బాసటగా నిలిచింది. ఒక దశలో సావిత్రిబాయి సుదీర్ఘకాలం జబ్బు పడితే స్కూళ్ల నిర్వహణభారం మోసింది. ఆ వివరాలన్నీ నా పుస్తకంలో ఉన్నాయి’ అని తెలిపింది రీతా రామస్వామి. ఎన్నెన్నో అవమానాలు ‘దిగువ వర్గాల వారిలో ఆడపిల్లలకు చదువెందుకు అనే భావన విపరీతంగా ఉండేది. వాళ్లకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేసేవారు. కాని వారి ఇళ్లకు వెళ్లి బడికి పంపమని కోరేది సావిత్రి. వారు శాపనార్థాలు పెట్టేవారు. దారిన పోతూ ఉంటే రాళ్లు విసిరేవారు. దానికి తోడు పేద వర్గాల వారిని చదివిస్తున్నందుకు అగ్రవర్ణాలు కక్ష కట్టి సావిత్రిబాయి మీద పేడనీళ్లు చల్లేవారు. అందుకని ఆమె స్కూలుకు వెళుతున్నప్పుడు తన సంచిలో చీర అదనంగా పెట్టుకునేది. ఎవరైనా పేడ నీళ్లు చల్లినా వెరవకుండా స్కూలుకు వెళ్లి చీర మార్చుకుని పాఠాలు చెప్పేది. ఆమె స్ఫూర్తి నేటికీ కొనసాగడం వల్ల మన దేశంలో బాలికల విద్య గణనీయంగా పెరిగింది. చదువులో ఉద్యోగాల్లో అమ్మాయిలు గొప్పగా రాణిస్తున్నారు. వారంతా తప్పక తెలుసుకోవాల్సిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే’ అంది రీతా రామస్వామి. -
Vijaya Gupta K: విశ్రాంత జీవితమూ విలువైనదే!
ఆమె రోజుకు ఆరు గంటలు పని చేస్తారు. ఇందులో ప్రత్యేకత ఏముంటుంది? నిజమే. ఆమె వయసు డెబ్బయ్. ఇదీ ఆమె ప్రత్యేకత. తన కోసమే కాదు... సమాజానికీ పనిచేస్తారు. ‘సృజనాత్మకత మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇష్టమైన పని దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజూ విలువైనదే... సద్వినియోగం చేసుకోవాలి’ అంటూన్న విజయాగుప్తా పరిచయం. ఇది స్క్రీన్ ఎరా. టీవీ స్క్రీన్, కంప్యూటర్, ల్యాప్టాప్ లేదా స్మార్ట్ ఫోన్. ఇరవై నాలుగ్గంటల్లో పద్నాలుగు గంటలు స్క్రీన్తోనే గడిపేస్తున్నారు. స్క్రీన్ మీద పని చేయాల్సిన ఉద్యోగులకు తప్పదు. మరి ఖాళీగా ఉంటూ సమయం ఎలా గడపాలో తెలియక స్క్రీన్కి అంకితమయ్యే వాళ్లు మాత్రం తప్పనిసరిగా తమ ఇరవై నాలుగ్గంటలనూ ఒకసారి విశ్లేషించుకోవాలని చెబుతున్నారు హైదరాబాద్, హిమాయత్ నగర్కు చెందిన విజయాగుప్తా కోట్రికె. తనకిష్టమైన వ్యాపకం కోసం ఇంట్లో ఒక గదిని వర్క్ స్టేషన్గా మార్చుకున్నారామె. ఎనిమిదేళ్ల వయసులో గ్రీటింగ్ కార్డు తయారు చేసిన సృజనాత్మకమైన ఆమె విజయ ప్రస్థానం ఇది. జీవితం ఇచ్చిన గిఫ్ట్ ‘‘మా నాన్న ఉద్యోగ రీత్యా నేను పుట్టినప్పుడు చెన్నైలో ఉన్నాం. ఆ తర్వాత హైదరాబాద్కి బదిలీ. ముగ్గురు అక్కలు, ముగ్గురు అన్నలతో మొత్తం ఏడుగురం. ఇంట్లో ఎవరూ ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండేవారు కాదు. పెళ్లి పత్రికల వెనుక ఖాళీ పేజీ మీద బొమ్మలు గీసి, పత్రిక మీద ఉండే కొన్ని బొమ్మలను కత్తిరించి అతికించి సొంతంగా గ్రీటింగ్ కార్డు తయారు చేశాను. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలతో విరామం వచ్చింది. పిల్లలు పెద్దయ్యి, నాక్కొంత విరామం వచ్చేటప్పటికి యాభై ఏళ్లు నిండాయి. అప్పుడు అనుకోకుండా ఒక వరలక్ష్మీవ్రతంలో వాళ్లిచ్చిన రిటర్న్ గిప్టులు చూసినప్పుడు నాలోని సృజనాత్మక కోణం నిద్రలేచింది. ఆ సందర్భం... జీవితం నాకిచ్చిన గిఫ్ట్ అనే చెప్పాలి. ఇక అప్పటి నుంచి రకరకాల ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాను. ఇప్పుడు రెండు వందలకు పైగా క్రియేటివ్ పీస్లను తయారు చేస్తున్నాను. నాకు ఎగ్జిబిషన్లకు వెళ్లడం అలవాటు. కొన్నా కొనకపోయినా సరే... ఎగ్జిబిషన్లకు వెళ్లేదాన్ని. ఏ ప్రాంతం ఏ హస్తకళలకు ప్రసిద్ధి అనేది అవగతమైంది. అలా ఉదయ్పూర్కెళ్లి అక్కడి కళాకారుల పనితీరును తెలుసుకున్నాను. నేను బీఏ హిందీ లిటరేచర్ స్టూడెంట్ని కావడంతో భాష సమస్య రాలేదు. మావారి సలహాతో నేను చేస్తున్న పనిని రిజిస్టర్ చేశాను. నాకు వచ్చిన ఆర్డర్లకు పని చేసివ్వడంతోపాటు పని నేర్చుకుంటామని వచ్చే మహిళలకు ఉచితంగా నేర్పిస్తున్నాను. ఇదీ రొటీన్! ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచిన తర్వాత రెండు గ్లాసుల వేడి నీటిని తాగుతాను. అరగంట వాకింగ్, మరో అరగంట డాక్టర్ సూచించిన ఎక్సర్సైజ్లు. ఎనిమిదింటికి కాఫీ లేదా టీ, ఓ గంట సేపు ఫోన్లో మెసేజ్ లు చెక్ చేసుకుని నా క్లయింట్ల నుంచి ఆర్డర్లు, ఇతర సందేహాలకు రిప్లయ్ ఇస్తాను. పదిగంటలకు వంట, పూజ పూర్తి చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. రెండు గంటలు విశ్రాంతి. మధ్యాహ్న భోజనం తర్వాత మా వారు బయటకు వెళ్లినప్పటి నుంచి నా గదిలో పని మొదలు పెడితే ఏడు గంటల వరకు కొనసాగుతుంది. రాత్రి ఎనిమిదిన్నరకు భోజనం. కొద్దిసేపు టీవీలో వార్తా విశేషాలు, గేమ్ షోలు కొద్దిసేపు టీవీ చూడడం పది గంటలకు నిద్ర. వారంలో మూడు రోజులు మా వాసవీ మహిళా సంఘం కార్యకలాపాలతో ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో ఉంటాను. హడావుడిగా పరుగులు ఉండవు, కానీ పనిలో ఉంటాను. మా అబ్బాయి, అమ్మాయి కూడా హైదరాబాద్లోనే ఉంటారు. వాళ్లు మా ఇంటికి వచ్చే ముందు ‘రేపు నీ పనులేంటమ్మా? మేము ఎప్పుడు రావచ్చు’ అని అడుగుతారు. పిల్లలు వాళ్ల ఉద్యోగాలు, వ్యాపారాల్లో, వాళ్ల పిల్లల చదువులతో బిజీగా ఉంటారు. పిల్లలు మన కోసం టైమ్ ఎప్పుడిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటే ఈ వయసులో తరచూ నిరాశ ఎదురవుతుంటుంది. అందుకే నా టైమ్ని సహాయం అవసరమైన బాలికల చదువు, ఉపాధి కల్పనలో నిమగ్నం చేసుకుంటాను. లాభనష్టాల్లేకుండా నడిచే బాలికల హాస్టల్ నిర్వహణ, మహిళా సంఘం కార్యకలాపాలు సంయుక్తంగా చూసుకుంటాం. సహాయం అవసరమై వచ్చిన వాళ్లకు హాస్టల్లో వసతి ఇచ్చి, మహిళా సంఘం తరఫున స్కిల్ డెవలప్మెంట్, వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇస్తాం. ఉడాన్ సర్వీస్ ఆర్గనైజేషన్లోనూ మెంబర్ని. దేశరక్షణలో ప్రాణాలు వదిలిన సైనికుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం పూర్తిగా అందనప్పుడు మా సంస్థ నుంచి వాళ్ల పిల్లల చదువు కోసం స్కూల్ ఫీజులు చెల్లిస్తాం. ఇదే మంచి సమయం! నా వయసు మహిళలకు నేను చెప్పగలిగిందొక్కటే... విశ్రాంత జీవితం శాపం కాదు, ఇది ఒక వరం. పిల్లలు మన మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా చూసుకోవాలని కోరుకోకూడదు. ఎవరికి వాళ్లు తమకంటూ ఒక వ్యాపకాన్ని వృద్ధి చేసుకోవాలి. పుస్తకాలు చదవడం కావచ్చు, పూజలు, సత్సంగాలు, ఆలయాల సందర్శనం... ఏదైనా కావచ్చు. మనిషికి సోషల్ లైఫ్ ఉండాలి. ఇంటినుంచి బయటకు వస్తే పరిచయాలు పెరుగుతాయి. భావ సారూప్యం కలిగిన వాళ్లతో స్నేహం ఏర్పడుతుంది. అప్పుడు జీవితంలో ప్రతిరోజూ సంతోషకరంగానే గడుస్తుంది’’ అన్నారు విజయా గుప్తా కోట్రికె. – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement