ఆడపిల్లలని చిన్నచూపు చూడకుండా మగవారితో సమానంగా ఉన్నత చదువులు చదివించాలని కాగజ్నగర్ డీఎస్పీ సురేశ్బాబు అన్నారు.
వాంకిడి, న్యూస్లైన్ : ఆడపిల్లలని చిన్నచూపు చూడకుండా మగవారితో సమానంగా ఉన్నత చదువులు చదివించాలని కాగజ్నగర్ డీఎస్పీ సురేశ్బాబు అన్నారు. మండలంలోని ఇంధాని గ్రామంలో శుక్రవారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలని అసహ్యించుకుని ఆడవాళ్ల శాతాన్ని తగ్గిస్తున్నారని, లింగ భేదం లేకుండా సమాజంలో అందరూ సమానమే భావనతో మెదలాలని తెలిపారు.
గ్రామంలో ఎలాంటి సమస్యలు వచ్చినా నేరుగా పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. పోలీసులంటే భయపడకుండా నిర్భయంగా సహాయం కోరవచ్చని పేర్కొన్నారు.
అనంతరం వృద్ధులకు దుప్పట్లు, నవయువ సూర్యకిరణాలు యూత్కు వాలీబాల్ అందజేశారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రోత్సాహం అందిస్తామని అన్నారు. వైద్యాధికారి విశ్వనాథ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం ప్రసవాలు ఇంట్లోనే జరుగుతున్నాయని, ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకుంటే ఆరోగ్యానికి హాని కలుగకుండా ఉండడంతోపాటు జనని సురక్ష యోజన పథకం కింద రూ.వెయ్యి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ తిరుపతి, సర్పంచ్ కొట్నాక విజయ్కుమార్, వైద్యులు గౌతమ్పవార్, ఆర్ఎంపీ అజయ్, రాజు, వెంకటి, దయాకర్, అశోక్, ఆప్తాలమిక్ వెంకటేశ్, విలేజ్ పోలీస్ అధికారి కనక జంగు, నవయువ సూర్యకిరణాలు యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ పాల్గొన్నారు.