
పొందూరు: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరుగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వీక్షించేందుకు శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన ముగ్గురు ఖాదీ కార్మికులకు ప్రత్యేక ఆహ్వనం అందింది. కేంద్ర ప్రభుత్వ ‘జన్ భాగీదారి’ దార్శనికతకు అనుగుణంగా దేశంలోని 75 మంది వడుకు, నేత కార్మికులకు ఎర్రకోటలోని వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. అందులో పొందూరుకు చెందిన బల్ల భద్రయ్య–లక్ష్మి దంపతులతో పాటు జల్లేపల్లి సూర్యకాంతంకు అదృష్టం దక్కింది.
గుర్తింపు లభించిందిలా..
పొందూరులోని చేనేతవాడకు చెందిన బల్ల భద్రయ్య 35 ఏళ్లుగా చేనేత వృత్తిలో ఉన్నారు. పొందూరు ఏఎఫ్కేకే సంఘంలో 15 ఏళ్లు ఫైన్ ఖాదీ పంచెలు (దోవత్) నేయడంలో ఎంతో నైపుణ్యం గల వ్యక్తిగా గుర్తింపు పొందారు. నూరవ కౌంట్ (ఫైన్) చిలపను తయారు చేసి వస్త్రం నేసేందుకు సంప్రదాయంగా అవసరమైన దారాన్ని తీయడంలో జల్లేపల్లి సూర్యకాంతం మంచి నేర్పరితనం కనబరచడంతో స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఆమెకు అవకాశం వచ్చింది.