సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశానికి మంత్రుల గైర్హాజరు చర్చాంశనీయంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఆరుగురు మంత్రులు హాజరు కాకపోవడం విశేషం
శుక్రవారం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి, అమరావతి రాజధాని పురోగతి వంటి కీలక అంశాలపై చంద్రబాబు చర్చించారు. అయితే, ఈ సమావేశానికి పలువురు మంత్రులు డుమ్మా కొట్టారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సుకు కూడా పవన్ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. నాదెండ్ల మనోహర్ సమావేశానికి దూరంగా ఉన్నారు. అనారోగ్య కారణంగా హోమ్ మంత్రి అనిత, మంత్రి టీజీ భరత్, మంత్రి గొట్టిపాటి రవి.. కుటుంబ కార్యక్రమం కారణంగా మరో మంత్రి ఫరూక్ హాజరు కాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి.
మొత్తం ఆరుగురు మంత్రులు గైర్హాజరు కావడంతో ఈ కేబినెట్ సమావేశం చుట్టూ రాజకీయ చర్చలు వేడెక్కాయి. ముఖ్యంగా పవన్ వరుసగా రెండు కీలక సమావేశాలకు హాజరు కాకపోవడంపై వివిధ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అధికార వర్గాలు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.



