కర్నూలు జిల్లా: సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ.. సొంతిల్లు కట్టుకుని ఆనందంగా జీవిస్తున్న దంపతులను మృత్యువు మింగేసింది. కర్ణాటక సరిహద్దు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరిని మింగేసింది. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. పట్టణంలోని తిరుమలనగర్ కాలనీకి చెందిన కార్పొరేషన్ బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగి అమరేష్ సుమతి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు అనురాగ్(31), బళ్లారికి చెందిన ఐశ్యర్య కూడా ఒక్కగానొక్క కుమార్తె. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు.
వీరికి మూడేళ్ల క్రితం వివాహమైంది. బెంగళూరులో ఉద్యోగం చేస్తూ సొంత ఇల్లు కూడా కట్టుకున్నారు. అనురాగ్ భార్యతో కలసి తల్లిదండ్రులను చూసేందుకు రెండు రోజుల క్రితం ఆదోనికి చేరుకున్నారు. బెంగళూరుకు తిరిగివెళ్తూ బళ్లారిలో ఉన్న ఐశ్యర్య తల్లిదండ్రులను పలకరించి వెళ్లాలనుకున్నారు. ఈ మేరకు ఇద్దరు బుధవారం సాయంత్రం కారులో వెళ్తుండగా కర్ణాటక రాష్ట్రం మోకా సమీపంలో శివపుర గ్రామశివారులో కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొంది.
తీవ్రంగా గాయపడిన ఐశ్వర్య అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలపాలైన అనురాగ్ను వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం బళ్లారి ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు రెఫర్ చేశారు. కాగా మార్గమధ్యలో అనురాగ్ మృతి చెందాడు. బళ్లారిలో పోస్టు మార్టం నిర్వహించి మృతదేహాలను ఆదోనికి తరలించారు. గురువారం ఆదోని లో అంత్యక్రియలు పూర్తి చేశారు. తిరుమలనగర్లో విషాదం అలుముకుంది.


