
ఈ నెలాఖరుకల్లా ఈ ప్రక్రియతో పాటు విధుల హేతుబద్ధీకరణ పూర్తిచేయాలి
ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారికి తప్పనిసరిగా స్థానచలనం
ఐదేళ్లు పూర్తికాకపోయినా అభ్యర్థనల మేరకు చెయ్యొచ్చు
గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 30లోగా వీరి విధుల హేతుబద్ధీకరణ, బదిలీల ప్రక్రియను పూర్తిచేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు స్పష్టంచేస్తూ బదిలీ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి కె. భాస్కర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మార్గదర్శకాల ప్రకారం మే 31 నాటికి ఒకే గ్రామ, వార్డు సచివాలయంలో ఐదేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీచేయాలి. ఐదేళ్లు పూర్తికాని ఉద్యోగులను కూడా వారి అభ్యర్థన మేరకు బదిలీ చెయ్యొచ్చు. అలాగే..
⇒ ఉద్యోగులను వారి సొంత మండలానికి బదిలీ చేయకూడదు. n దృష్టిలోపం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. మానసిక వికలాంగ పిల్లలు ఉన్న ఉద్యోగులను సంబంధిత వైద్య సౌకర్యాలు అందుబాటులో చోటుకు లేదా వారు కోరుకునే ప్రాంతానికి బదిలీచేయాలి.
⇒ గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులకు, 40 శాతం వైకల్యంగల ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలి.
⇒ క్యాన్సర్, ఓపెన్హార్ట్ ఆపరేషన్, న్యూరో సర్జరీ, కిడ్ని ట్రాన్స్ప్లాంటేషన్ వంటి వ్యాధులతో బాధపడే ఉద్యోగులను లేదా ఆ ఉద్యోగులపై ఆధారపడిన భార్య లేదా పిల్లలుంటే అటువంటి వారిని ఆయా వైద్య సౌకర్యాలున్న ప్రాంతాలకు బదిలీచేయాలి.
⇒ కారుణ్య ప్రాతిపదికన నియమించిన వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలి.
⇒ దృష్టిలోపం ఉన్న ఉద్యోగులు బదిలీ నుంచి మినహాయింపు పొందవచ్చు. ఒకవేళ బదిలీ కోసం అభ్యర్థిస్తే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆ కేటగిరిలో స్పష్టమైన ఖాళీ లభ్యత ఆధారంగా కోరుకున్న చోటుకు బదిలీచేయాలి.
⇒ భార్యాభర్తలు ఉద్యోగులైతే ఇద్దరినీ ఒకే స్టేషన్కు లేదా దగ్గరగా ఉన్న స్టేషన్లకు బదిలీచేయాలి.
⇒ గిరిజన, మారుమూల, వెనుకబడిన ప్రాంతాల్లో ఖాళీల భర్తీకి కలెక్టర్లు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఐటీడీఏ ప్రాంతాలకు బదిలీ అయిన ఉద్యోగులు నిర్ధేశిత గడువులోగా విధుల్లో చేరాలి. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.
⇒ ఇక నిధులు చెల్లింపు పెండింగ్ ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేయకూడదు.
⇒ ఉద్యోగుల బదిలీలను ఈ మార్గదర్శకాల మేరకు అత్యంత పారదర్శకంగా ఎటువంటి ఫిర్యాదులు, ఆరోపణలకు అవకాశంలేకుండా గడువులోగా పూర్తిచేయాలి.
సొంత మండల పరిధిలోనే బదిలీలు చేయాలి..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో కోరుకున్న వారిని మినహాయించి మిగిలిన వారినందరినీ సొంత మండలాల పరిధిలోనే బదిలీలు కల్పించాలని గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎం.డి. జానీపాషా, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు ప్రభుత్వాన్ని కోరారు.ఇతర మండలాలకు వారిని బదిలీ చేయాలనే నిబంధనతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు.