
చంద్రబాబుపై ముస్లింల ఆగ్రహం
కేంద్రంలో భాగస్వామిగా ఉన్న బాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారంటూ ధ్వజం
సాక్షి, అమరావతి: వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెడుతున్న మోదీ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా చంద్రబాబు ఉండడంపై ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వక్ఫ్ సవరణ బిల్లుపై వైఎస్సార్సీపీతో పాటు పలు పార్టీలు అభ్యంతరం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ పార్లమెంట్లో బిల్లును ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం కావడంతో ముస్లిం సమాజం తీవ్ర ఆందోళన చెందుతోంది.
రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాసేలా ప్రతిపాదించిన ఈ బిల్లును వైఎస్సార్సీపీ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీ నేతలు ముస్లింల నిరసనల్లో కూడా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. కానీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు.. ఈ బిల్లు విషయంలో డబుల్ గేమ్ ఆడుతూ వచ్చారు. కేంద్రంలో బిల్లుకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. రాష్ట్రంలోని ముస్లింలకు మాయ మాటలు చెబుతూ రోజులు గడిపారు. దీంతో ఆయన తీరుపై ముస్లిం సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచి్చన ఇఫ్తార్ విందును కూడా బహిష్కరించి.. నిరసన తెలిపింది.
ఈ నేపథ్యంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ సోమవారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ముస్లింల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను ఏకరువు పెట్టినట్లు తెలిసింది. భేటీ అనంతరం అజీజ్ మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చించామని, ముస్లింలపై చంద్రబాబు ఈగ కూడా వాలనివ్వరంటూ కబుర్లు చెప్పడంతో వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడమంటే.. తమకు ద్రోహం చేయడమేనని మండిపడ్డారు. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని ముస్లింలు హెచ్చరించారు.
ముస్లింలకు ద్రోహం చేయడమే..
వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడమంటే ముస్లింలకు తీవ్ర ద్రోహం చేయడమే. వక్ఫ్ ఆస్తులను రక్షిస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల హామీ ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకోవాలంటే పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించాలి. – గౌస్ లాజమ్, ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ మాజీ చైర్మన్
చరిత్ర హీనుడు..
మాయ మాటలతో మభ్యపెట్టేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలను ముస్లిం సమాజం గుర్తించింది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు. – షేక్ మునీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ కన్వినర్
వక్ఫ్ బిల్లుకు జనసేన మద్దతు
సాక్షి, అమరావతి: వక్ఫ్ సవరణ బిల్లుకు జనసేన పార్టీ మద్దతు తెలిపింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్కు రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న పి.హరిప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వక్ఫ్ చట్ట సవరణ ముస్లిం సమాజానికి మేలు చేస్తుందని జనసేన విశ్వసిస్తోందన్నారు. ఈ మేరకు జనసేన ఎంపీలకు పార్టీ పవన్ దిశానిర్దేశం చేశారన్నారు. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటింగ్లో పాల్గొనాలని ఎంపీలను కోరారన్నారు.