కర్నూలు: ఇళ్లకు తాళాలు పడ్డాయి.. వీధులు బోసిపోయాయి.. రచ్చబండలు నిర్మానుష్యంగా మారాయి.. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కరువయ్యారు.. దేవాలయాల్లో పూజ లు చేసేవారు కనిపించడం లేదు.. ఏ ఊరిని చూసినా ఏమున్నది గర్వకారణం.. పంటలు చేతికి రాక.. అప్పులు తీర్చలేక రైతులకు వలసబాటే మిగిలింది. పనుల కోసం వ్యవ సాయ కూలీలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడంతోపాటు కరువులో సహాయక చర్యలను విస్మరించింది. ఫలితంగా పిల్లాపాపలు, వృద్ధులతో ఊరూరా ప్రజలు వలస వెళ్తూ కనిపిస్తున్నారు. ఇక్కడే ఎక్కువ కాలం పస్తులతో ఉండలేమని మూటాముల్లె సర్దుకుని పయనమవుతున్నారు.

పలకరించే వారు కరువు..
హాలహర్వి మండలంలోని పలు గ్రామాల్లో పలకరించే ప్రజలు కరువయ్యారు. కుల, మతాలకు అతీతంగా కలసి మెలసి జీవనం కొనసాగిస్తున్న ప్రజలు ఇళ్లకు తాళాలను వేసి బతుకు బండిని లాగించేందుకు దూర ప్రాంతాలకు వెళ్లారు. విరుపాపురం, బల్గోట, గ్రామాల్లో 20 కుటుంబాలకు చెందిన సన్న, చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు ఏడురోజుల వ్యవధిలోనే వసలబాట పట్టారు. ఆయా గ్రామాల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులతో కలసి విద్యార్థులు వలస వెళ్లిపోవడంతో ప్రభుత్వ పాఠశాల్లో హాజరు శాతం తగ్గిపోయింది.

నిర్మానుష్యంగా విరుపాపురం
కనిపించని సీజనల్ వసతిగృహాలు
వలస వెళ్లే విద్యార్థుల కోసం సీజనల్ వసతి గృహాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఎంపీడీఓలు, విద్యా శాఖ అధికారులు సమాచారాన్ని గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పలేకపోయారు. సీజనల్ వసతి గృహాలు ఎక్కడా కనిపించకపోవడంతో వ్యవసాయకూలీల వెంట చిన్నారులు వలసబాట పట్టాల్సి వచ్చింది. హాలహర్వి మండలంలో 26 ఎంపీపీ పాఠశాలలు, ఎనిమిది జెడ్పీహైసూ్కళ్లు ఉన్నాయి. మొత్తం 3,600 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. హాలహర్వి మండలం విరుపాపురం గ్రామ ఎంపీపీ పాఠశాలలో ఒకటో తరగతిలో 21 మందికిగాను నలుగురు ఉన్నారు. రెండో తరగతిలో 16 మందికి గాను నలుగురు, మూడో తరగతిలో 19మందికి గాను ఏడుగురు హాజరవుతున్నారు. ఇక నాలుగో తరగతిలో 15 మందికి గాను ఐదుగురు ఉన్నారు. ఐదో తరగతిలో 20 మందికిపైగా విద్యార్థులను తల్లిదండ్రులు వారి వెంట వలస వెళ్లారు.
బువ్వ దొరక్క వలస
ఉన్న రెండు ఎకరాల్లో పత్తి సాగుచేశా. ఎకరానికి రూ. 25 వేలు ఖర్చు చేశా. వర్షాల్లేక పంట ఎదుగుదల లేదు. ఇక్కడే ఉంటే మా కుటుంబంలో ఉన్న నలుగురు పస్తులతో ఉండాలి. బువ్వ దొరక్కపోవడంతోనే తెలంగాణకు వెళ్లక తప్పడంలేదు.
– రామకృష్ణ, విరుపాపురం గ్రామస్తుడు
విద్యార్థుల సంఖ్య తగ్గింది
పిల్లలతో కలసి వలసలు వెళ్లవద్దని తల్లిదండ్రులకు చెప్పాం. చదువుకోకుంటే చిన్నారుల బంగారు భవిష్యత్తుకు ఇబ్బందిగా మారుతుందని తెలిపాం. అయినా ఎవరూ వినడం లేదు. విద్యార్థులతో కలసి వలస వెళ్తున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గింది.
– కమల్ తేజ, విరుపాపురం గ్రామ ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయుడు
ఇదీ చదవండి: దళితులంటే సునీతమ్మకు నచ్చదా?


