అనంతపురం: దళితులంటే పరిటాల సునీతకు నచ్చదా? అంటూ గొరిదిండ్లకు చెందిన దళిత మహిళలు ఎమ్మెల్యే సునీతపై పెద్ద ఎత్తున మండిపడ్డారు. శుక్రవారం ఆత్మకూరులో గొరిదిండ్ల దాడి విషయంలోని బాధితులు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు సీపీ ఆలమూరు ఓబులేసు, దళిత మహిళలు మాట్లాడుతూ గొరిదిండ్లకు అనూష తన భర్త, తండ్రిని కోల్పోయి ఉన్న ఒక్క కూతురిని చూసుకోవడానికి వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే అదే గ్రామానికి చెందిన అక్కులప్ప అనే వ్యక్తి అనూష పట్ల అనుచితంగా ప్రవర్తించి, అత్యాచార యత్నం చేశాడన్నారు.
బుధవారం రాత్రి అక్కులప్ప మధ్యం తాగి అనూషను కత్తితో పొడవగా, తీవ్రంగా గాయపడిందన్నారు. అనూషపై దాడిని అడ్డుకోబోయిన హరీష్ కుమార్, మహేంద్ర, శివానందను గొడ్డలితో దాడి చేశారన్నారు. ప్రస్తుతం వారు అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. దాడి చేసిన వారిపై అక్కులప్ప, మధు, సోమశేఖర్, రామాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేవలం అక్కులప్పపై కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుకున్నారన్నారు. మిగిలిన వారిని టీడీపీ నాయకుడు బాలాజీ ఎమ్మెల్యే సునీత ఇంట్లో దాచిపెట్టారన్నారు.
కక్షలను పెంచి పోషిస్తున్న ఎమ్మెల్యే సునీత..
నియోజకవర్గంలో మహిళల పట్ల ఎన్ని దాడులు జరిగినా ఎమ్మెల్యే సునీత మాత్రం పట్టించుకోలేదని గ్రామానికి చెందిన దళిత నాయకులు అన్నారు. పరిటాల సునీత ఎప్పుడు అధికారంలోకొచ్చినా ఎస్సీలపైనే దాడులు జరుగుతున్నాయన్నారు. హోంమంత్రిగా దళిత మహిళ ఉన్నా.. మహిళలపై దాడులు పెచ్చుమీరుతున్నాయన్నారు. టీడీపీ అధికారం వచ్చిన తర్వాత ప్రజలు ఊర్లు విడిచే పరిస్థితి వచ్చిందన్నారు. నలుగురిపై కేసులు నమోదు చేయకపోతే పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని బాలాజీ ఎవరి పేరు చెబితే వారిపైన మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారని, ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మండల కన్వీనర్ బాల పోతన్న, యూత్ కన్వీనర్ కొండారెడ్డి,మాజీ డీసీసీబీ డైరెక్టర్ వాసుదేవరెడ్డి, లక్ష్మిరెడ్డి, గొరిదిండ్ల నరసింహ, రమేష్ కేశవరెడ్డి, మాధన్న, గోవింద్ , ఆదినారాయణ, లక్ష్మి, అఖిల, లలితమ్మ, సంగమ్మ,రామక్క,లక్ష్మక్క, ముత్యాలక్క,నారాయణమ్మ,కుంటెమ్మ,నాగమణి, శాంతమ్మ, కుళ్లాయప్ప, పెద్దన్న పాల్గొన్నారు.
అమ్మ లేకపోతే అనాథనైతా..
మా అమ్మను కత్తితో పొడిచారు.. మా నాన్న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.. మా అమ్మ కూలి పనులు చేస్తూ నన్ను చదివిస్తోంది. మా అమ్మను వదిలేయండి.. మా అమ్మను కత్తితో పొడిచారు. మా అమ్మ లేకపోతే నేను బతకను. నన్ను అనాథను చేయకండి అంటూ అనూష కూతురు ప్రీతి సుధ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం అందరినీ కలచివేసింది.

సమావేశంలో మాట్లాడుతున్న దళిత నాయకులు
ఇదీ చదవండి: రాణీగారి తోటలో చంపేశారు


