
అమరావతి, సాక్షి: ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి ఏపీ హైకోర్టులో మరో ఊరట దక్కింది. కూటమి నేతలపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే విజయవాడ సూర్యారావుపేట పీఎస్లో నమోదైన కేసులో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.
తనపై నమోదు అయిన కేసులను కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టు(AP high Court)లో పోసాని క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే గురువారం వాదనలు విన్న హైకోర్టు.. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదు అయిన కేసుల్లో తొందరపాటు చర్యలు వద్దని ఆదేశించింది. సోమవారానికి తదుపరి విచారణను వాయిదా వేసింది.
తాజాగా.. ఇవాళ పోసానిని అరెస్ట్ చేయొద్దంటూ విజయవాడ సూర్యారావు పేట పోలీసులను ఆదేశించింది. పోసాని తరఫున ఇవాళ వైఎస్సార్సీపీ లీగల్ కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు.
హైదరాబాద్ టు కర్నూల్ జైలు.. ఎప్పుడు.. ఏం జరిగిందంటే..
ఫిబ్రవరి 24న.. పవన్ కల్యాణ్తో పాటు కూటమి నేతలను పోసాని గతంలో దూషించారంటూ జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదుతో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పీఎస్లో కేసు నమోదు
ఫిబ్రవరి 27న.. హైదరాబాద్లోని తన నివాసంలో పోసానిని అరెస్ట్ చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు.. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినా వినని పోలీసులు.. అదే రాత్రి తరలింపు
ఫిబ్రవరి 28న.. ఒబులవారిపల్లి పీఎస్కు తరలింపు.. సుదీర్ఘ విచారణ.. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మరోసారి పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన పోసాని
ఫిబ్రవరి 28న.. రైల్వే కోడూరులో పోసానిని ప్రవేశపెట్టిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్ విధింపు
మార్చి1న.. ప్రిజనర్ ట్రాన్సిట్(PT) వారెంట్ కింద అదుపులోకి తీసుకున్న పల్నాడు నరసరావుపేట టూటౌన్ పోలీసులు
మార్చి3న.. నరసరావుపేట కోర్టులో పోసానిని ప్రవేశపెట్టిన పోలీసులు. పోసానికి జ్యూడీషియల్ రిమాండ్ విధించిన జడ్జి
మార్చి3న.. పీటీ వారెంట్ జారీ చేసిన కర్నూల్ జిల్లా ఆదోని త్రీటౌన్ పోలీసులు.
మార్చి4న.. నరసరావుపేట నుంచి ఆదోని పీఎస్కు పోసాని తరలింపు
మార్చి 5న.. మెజిస్ట్రేట్ నివాసంలో పోసానిని ప్రవేశపెట్టిన ఆదోని త్రీటౌన్ పోలీసులు.. రిమాండ్ మీద కర్నూల్ జైలుకు తరలించారు
మార్చి6న.. ఆదోని కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ విచారణ.. కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
మార్చి7న.. కర్నూలు జస్టిస్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ విచారణ
కౌంటర్ వేయనున్న ఆదోని పోలీసులు
ఇవాళ సాయంత్రం కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ పై కర్నూలు కోర్టులో తీర్పు వెలువడే అవకాశం