
వారి జీవితాలతో ఆటలాడితే చూస్తూ ఊరుకోం
కాలేజీలు ఫీజులు చెల్లించకుంటే వేరే పద్ధతిలో వసూలు చేసుకోండి
అంతేగానీ పరీక్షా ఫలితాలను ఎలా ఆపుతారు?
నాగార్జున యూనివర్సిటీ రిజిస్ట్రార్పై హైకోర్టు మండిపాటు
బకాయిలపై పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయండి
రాష్ట్ర ప్రభుత్వానికి, యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి : పలు డిగ్రీ కాలేజీలు అఫిలియేషన్ ఫీజు చెల్లించలేదన్న కారణంతో ఆ కాలేజీల్లోని విద్యార్థుల పరీక్ష ఫలితాలను నిలిపేసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. కాలేజీలు ఫీజు చెల్లించకుంటే, అందుకు విద్యార్థులు ఎందుకు మూల్యం చెల్లించుకోవాలని ప్రశ్నించింది. ‘ఫీజులు చెల్లించని కాలేజీలను ఉరి తియ్యండి. మేం ఎంతమాత్రం జోక్యం చేసుకోం.
కానీ, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటామంటే మాత్రం చూస్తూ ఉరుకోం. మాకు విద్యార్థుల భవిష్యత్తు మాత్రమే ముఖ్యం. ఇంతకుమించి మాకు ఏదీ ముఖ్యంకాదు. ఫలితాలు వెల్లడించకుంటే అది విద్యార్థుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పరీక్ష ఫలితాలను వెల్లడించకుండా ఆపేస్తామంటే మాత్రం అంగీకరించే ప్రసక్తేలేదు. కాలేజీలు అఫిలియేషన్ ఫీజు చెల్లించకుంటే, అసలు ఈ కాలేజీల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు ఎందుకు అనుమతినిచ్చారు? చేరిన విద్యార్థులను మరో కాలేజీకి తరలించి ఉండాల్సింది.
ఇవేవీ చేయకుండా విద్యార్థులను బాధ్యులుగా చేస్తూ వారి పరీక్ష ఫలితాలను నిలిపేయడం ఏంటి? మేం కాలేజీల వైపు లేం.. విద్యార్థుల పక్షానే ఉన్నాం. అసలు కోర్టుకొచి్చన డిగ్రీ కాలేజీలకు చెల్లించాలి్సన స్కాలర్షిప్పుల బకాయిలను ఇప్పటివరకు ఎంత మొత్తం చెల్లించారు? ఇంకా ఎంత చెల్లించాలి? తదితర వివరాలను మా ముందుంచండి’.. అని రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాగార్జున యూనివర్సిటీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్లే..
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, ఆ కాలేజీలు నిబంధనల ప్రకారం చెల్లించాలి్సన అఫిలియేషన్ ఫీజు, పరీక్ష ఫీజులను చెల్లించలేదన్నారు. ఈ సమయంలో కాలేజీల తరఫు న్యాయవాది అనుపమాదేవి జోక్యం చేసుకుంటూ, పరీక్ష ఫీజులను చెల్లించామన్నారు. అఫిలియేషన్ ఫీజును మాత్రమే చెల్లించలేదని, కాలేజీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడమే అందుకు కారణమని ఆమె తెలిపారు. . న్యాయమూర్తి స్పందిస్తూ.. కాలేజీలు ఫీజులు చెల్లించలేదన్న నెపంతో విద్యార్థుల పరీక్షల ఫలితాలను ఆపడానికి వీల్లేదన్నారు. బకాయిల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, యూనివర్సిటీ రిజిస్ట్రార్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేశారు.
ఫలితాల నిలుపుదలపై హైకోర్టుకు కాలేజీలు..
తమ కాలేజీల్లో చదువుతూ 6వ సెమిస్టర్ పరీక్షలు రాసిన 2022–25 బ్యాచ్ విద్యార్థుల పరీక్ష ఫలితాలను నాగార్జున యూనివర్సిటీ వెల్లడించకుండా నిలిపేయడాన్ని సవాలుచేస్తూ పలు కాలేజీల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై గత వారం విచారణ జరిపిన జస్టిస్ రామకృష్ణ ప్రసాద్.. వర్సిటీ రిజిస్ట్రార్ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే.