
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు ఏడుగురు న్యాయవాదుల పేర్లను సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన తీర్మానానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోదముద్ర వేశారు. అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాం సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణలను న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఏడుగురి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వీరిలో అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాం సుందర్, ఊటుకూరు శ్రీనివాస్ న్యాయమూర్తులు కాగా, బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణలు అదనపు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు. ఈ ఏడుగురూ రెండు మూడు రోజుల్లో న్యాయమూర్తులుగా ప్రమాణం చేయనున్నారు. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరుతుంది.