సాయికృష్ణ కేసు దర్యాప్తుపై స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వండి | High Court bench orders SIT on status of Sai Krishna case investigation | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ కేసు దర్యాప్తుపై స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వండి

Jul 9 2026 5:44 AM | Updated on Jul 9 2026 5:44 AM

High Court bench orders SIT on status of Sai Krishna case investigation

నివేదికను సీల్డ్‌ కవర్‌లో మా ముందుంచండి

సిట్‌కు హైకోర్టు ధర్మాసనం ఆదేశం

సాయికృష్ణ లాకప్‌డెత్‌లో డీజీపీ, విజయవాడ సీపీ పాత్ర ఉంది

సిట్‌ ఈ కేసును కేవలం సీఐ నాగరాజుకే పరిమితం చేస్తోంది

సిట్‌ దర్యాప్తుపై నమ్మకమే లేదు

స్వతంత్ర దర్యాప్తు జరిపితేనే వాస్తవాలు తేలుతాయి

సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు వాదనలు

సాక్షి, అమరావతి: కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో దర్యాప్తు పురోగతి వివరాలతో స్టేటస్‌ రిపోర్ట్‌ను సీల్డ్‌ కవర్‌లో తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సొసైటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ కాన్‌స్టిట్యూషనల్‌ రైట్స్‌ సంస్థ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో  ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

సీజే ధర్మాసనం ముందు తాజాగా  విచారణకు వచ్చిన ఈ వ్యాజ్యంలో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అంతకుముందు వాదనలు వినిపించారు.  ‘సాయికృష్ణ లాకప్‌డెత్‌ వ్యవహారాన్ని ప్రభుత్వం కేవలం కృష్ణలంక ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు వరకే పరిమితం చేస్తోంది.  లాకప్‌డెత్‌ వెనుక డీజీపీ, విజయవాడ కమిషనర్, డీసీపీ, ఏసీపీ తదితరుల పాత్ర ఉంది. సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ సందర్భంగా డీజీపీ, విజయవాడ కమిషనర్‌లు హైకోర్టును తప్పుదోవ పట్టించారు.  సాయికృష్ణ ఎక్కడ ఉన్నారో తమకు తెలియనే తెలియదని చెప్పారు. 

అయితే నాగరాజును అరెస్ట్‌ చేసిన తరువాత దాఖలు చేసిన రిమాండ్‌ రిపోర్ట్‌లో సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మే 6నే అదుపులోకి తీసుకున్నారు. తద్వారా సాయికృష్ణ గురించి పూర్తి వివరాలు డీజీపీ, కమిషనర్‌లకు స్పష్టంగా తెలుసని అర్థమవుతోంది. దీనిపై పారదర్శక, నిష్పాక్షిక దర్యాప్తు కోరుతున్నాం. సిట్‌ దర్యాప్తుపై విశ్వాసం లేదు.  స్వతంత్ర సంస్థ దర్యాప్తుతోనే నిజాలు నిగ్గుతేలుతాయి. ఈ దారుణంలో డీజీపీతో సహా ఉన్నతాధికారులు చట్టం నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు’ అని పొన్నవోలు ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. కాగా, ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్లు,  ఆరుగురిని నిందితులుగా చేర్చినట్లు సిట్‌ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఈ సందర్భంగా ధర్మాసనానికి తెలియజేశారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement