హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు | Anantapur court sentences seven to rigorous imprisonment for life in murder case | Sakshi
Sakshi News home page

హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు

Sep 24 2024 5:14 AM | Updated on Sep 24 2024 5:14 AM

Anantapur court sentences seven to rigorous imprisonment for life in murder case

ముద్దాయిల్లో ఆరుగురు సోదరులే.. మరొకరు వారి బంధువు

వైఎస్సార్‌సీపీ నాయకుడు శివారెడ్డి హత్య కేసులో అనంతపురం జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి తీర్పు

అనంతపురం: అనంతపురం రూరల్‌ మండలం కందుకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు దెయ్యం శివారెడ్డి హత్య కేసులో ఏడుగురు నిందితులకు రెండు జీవితకాల కఠిన కారాగార శిక్షలు (ఏకకాలంలో అమలవుతుంది) విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్‌ తీర్పు చెప్పారు. కందుకూరు గ్రామానికి చెందిన దెయ్యం శివారెడ్డి, అతని కుమారుడు భానుప్రకాష్‌రెడ్డి 2018, మార్చి 30వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు పొలంలో గడ్డి కోసుకుని బైక్‌పై పెట్టుకుని ఇంటికి వెళుతుండగా, వారి గ్రామానికే చెందిన టీడీపీ నాయకుడు బోయ సాకే బాలకృష్ణ, అతని చిన్న తమ్ముడు (మైనర్‌) అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

బైక్‌ నడుపుతున్న భానుప్రకాష్‌రెడ్డి ఆపకుండా ముందుకు వెళ్లగా, బాలకృష్ణ తమ్ముడు రమేష్, బంధువులు అశోక్, సూర్యనారాయణ మరో బైక్‌పై వచ్చి ఢీకొట్టారు. భానుప్రకాష్‌రెడ్డి, శివారెడ్డి కిందపడిపోయారు. బాలకృష్ణ, అతని చిన్న తమ్ముడు (మైనర్‌), సూర్యనారా యణ వేటకొడవళ్లతో శివారెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తన తండ్రిని చంపవద్దని వేడుకున్న భానుప్రకాష్‌రెడ్డిపై కూడా దాడి చేసేందుకు బాలకృష్ణ తమ్ముళ్లు భాస్కర్, విజయ్, కుమారుడు (మైనర్‌) వేటకొడవళ్లు పట్టుకుని వెంటపడ్డారు. భానుప్రకా ష్‌రెడ్డి కేకలు వేయడంతో సమీపంలోనే పొలంలో ఉన్న అతని చిన్నాన్న నరసింహారెడ్డి, నాగిరెడ్డి, సతీష్‌రెడ్డి రావడంతో బాలకృష్ణ, అతని తమ్ముళ్లు, బంధువులు పారిపోయారు.

తీవ్రంగా గాయపడిన శివారెడ్డి అక్కడిక్కడే చనిపోయాడు. భానుప్రకాష్‌రెడ్డి ఇటుకలపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు  చేశారు.  అభియోగాలు రుజువుకావడంతో బోయ సాకే బాలకృష్ణ, రమేష్, అశోక్, భాస్కర్, విజయ్‌కుమార్, తలా రి సూర్యనారాయణ, మహేంద్రలకు రెండు జీవిత కాలాల కఠిన కారాగార శిక్ష (ఏకకాలంలో అమలు) విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వీరిలో సాకే భాస్కర్, సాకే విజయ్‌కుమార్‌లకు రూ.35వేలు చొప్పున, మిగిలిన ఐదుగురికి రూ.30 వేలు చొప్పున జరిమానా విధించారు. ఇద్ద రు మైనర్లపై జువైనల్‌ కోర్టులో కేసు నడుస్తోంది. ఈ కేసులో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు. శిక్ష పడినవారిలో సూర్యనారాయణ మినహా మిగిలిన ఆరుగురు అన్నదమ్ములు కావడం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement