
కొవ్వూరు డివిజన్లోని ఓ సీఐ తీరుపై విమర్శల వెల్లువ
లంచాలు తీసుకుని బాధితులపైనే కేసులు కడుతున్న వైనం
రిసార్టుకు వస్తే సమస్య పరిష్కారిస్తానంటూ మహిళలకు వేధింపులు
గోదావరి తీరంలోని రిసార్ట్లో శృంగార కార్యకలాపాలు
ఆయన పరిధిలో పోస్టింగ్ వద్దంటూ ఎస్ఐల గగ్గోలు
సాక్షి, టాస్క్ఫోర్స్: తూర్పు గోదావరి జిల్లాలో సివిల్ పోలీసుల దందాలు పెరిగిపోతున్నాయి. కొవ్వూరు డివిజన్ పరిధిలో అయితే కొన్ని పోలీస్ స్టేషన్లు పూర్తిగా గతి తప్పాయి. కొందరు పోలీసు అధికారులు బాధితులను పీడించుకుతింటున్నారు. ఒక సీఐ అయితే ఏకంగా కాసులు ఇస్తేనే కేసులు ఉంటాయని బహిరంగంగా చెబుతున్నారు. ఆ సీఐ డబ్బులు తీసుకుని ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనే కేసు నమోదు చేసి కోర్టుకు పంపించారని తెలుస్తోంది.
మరో వ్యక్తి ఫిర్యాదు చేస్తే, అవతల వారి నుంచి సొమ్ము తీసుకొని బలవంతంగా సెటిల్ చేశారని సమాచారం. ఆయన వారాంతాల్లో ఒక రిసార్ట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, సర్కిల్ పరిధిలోని ఇసుక మాఫియా, మద్యం షాపుల నుంచి మామూళ్లు మస్తుగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతానికి చివరిలో ఉన్న ఈ నియోజకవర్గంలో నాలుగు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. నియోజకవర్గంలోని ఐదు ఇసుక రీచ్ల నుంచి ప్రతి నెలా పోలీస్ స్టేషన్కు రూ.30వేలు చొప్పున సీఐకి మామూళ్లు వెళుతున్నాయని ప్రచారం జరుగుతోంది. మద్యం షాపుల నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున సీఐ వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఆ సీఐ పనితీరు నచ్చని ఇద్దరు ఎస్ఐలు విధుల్లో చేరిన మూడు నెలల్లోనే బదిలీపై వెళ్లారని సమాచారం.
సొమ్ము ఇచ్చుకో.. పేకాట ఆడుకో..
ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు బహిరంగంగా పేకాట శిబిరాలు నిర్వహిస్తుండగా, వారి నుంచి సదరు సీఐ మామూళ్లు తీసుకుని కళ్లు మూసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డెల్టాలో భారీగా పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటే కాపలాగా పోలీసులే వ్యవహరిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇంటెలిజెన్స్ సిబ్బంది పేకాట శిబిరాలపై దాడులకు సిద్ధమైతే, వెంటనే ఆ సమాచారం నిర్వాహకులకు ఇస్తున్నారని, పారిపోయేందుకు సూచనలు కూడా పోలీసులే చెబుతున్నారని తెలుస్తోంది. ఎప్పుడైనా అవసరమైతే అనామకులకు కొంత సొమ్ము ఇచ్చి వారిపై కేసులు నమోదు చేస్తున్నారని సమాచారం. రోడ్డు ప్రమాదాలు, ఇళ్ల వద్ద గొడవలు వంటివాటిని కూడా సెటిల్మెంట్ పేరుతో ఆ సీఐ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
రిసార్ట్లో రాసలీలలు
కేసుల విషయమై వచ్చే కొందరు మహిళలను ఆ సీఐ లొంగదీసుకుని రాసలీలలు సాగిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి ఒక మహిళా హోంగార్డు సహకారం అందిస్తున్నట్టు సమాచారం. గోదావరి తీరంలో వెలసిన ఒక రిసార్ట్లో లేదా ఆ మహిళా çహోంగార్డు ఇంట్లో ఈ వ్యవహారాలు నిస్సిగ్గుగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సీఐ దందాలపై ఉన్నతాధికారులకు నివేదికలు వెళ్లినా పట్టించుకోవడం లేదని, ఎక్కడ తాము ఇరుక్కుపోతామోనని సర్కిల్లోని ఎస్ఐలు, సిబ్బంది భయపడుతున్నట్లు సమాచారం.