● పరిష్కార వేదికలో ప్రజల వినతి
● వివిధ సమస్యలపై 500 అర్జీలు
● ఈ రైతు పేరు బసన్న. బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు గ్రామం. ఇతనికి సర్వే నంబరు 196–సి2లో ఐదు ఎకరాల పొలం ఉంది. రెండేళ్లుగా అన్నదాత సుఖీభవ డబ్బులు పడటం లేదు. అధికారులకు ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా న్యాయం జరగలేదని ఆవేదన చెందాడు.
అనంతపురం అర్బన్: ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు వెల్లువెత్తాయి. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ప్రజల నుంచి కలెక్టర్ ఆనంద్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డీఆర్ఓ మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, మల్లికార్జునరెడ్డి తదితరులు 500 అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 236, ఇతర సమస్యలపై 264 వినతులు ఉన్నాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు.
ఎస్డీసీ కిరణ్మయి
వేధింపులు తట్టుకోలేకపోతున్నాం
కలెక్టర్, జేసీకి సిబ్బంది ఫిర్యాదు
అనంతపురం అర్బన్: హంద్రీ–నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) భూ సేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్డీసీ) కిరణ్మయి వేధింపులు తట్టుకోలేక పోతున్నామని ఆ శాఖ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఎన్ఎస్ఎస్ భూ సేకరణ విభాగం డీటీ, సర్వేయర్, ఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్, వాచ్మెన్, స్వీపర్ మొత్తం 12 మంది సోమవారం కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్కు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఎస్డీసీ తమను తీవ్ర వేధింపులకు గురిచేయడమే కాకుండా నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతున్నారని విన్నవించినట్లు సమాచారం. ఆమె వద్ద తాము పనిచేయలేమని, సామూహిక సెలవుపై వెళతామని వేడుకున్నట్లు తెలిసింది. తనపై సిబ్బంది ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న ఎస్డీసీ కిరణ్మయి వెనువెంటనే కలెక్టర్, జేసీని కలిసి సంజాయిషీ ఇచ్చినట్లు తెలిసింది. ఇక్కడికి బదిలీపై రాకముందు ఆమె నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పనిచేసినప్పుడు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నట్లు తెలిసింది. హెచ్ఎన్ఎస్ఎస్ (ఎల్ఏ) సిబ్బంది ఫిర్యాదుపై కలెక్టర్ను వివరణ కోరగా...విచారణ చేయించి వాస్తవాలు తెలుసుకుంటామని చెప్పారు.


