గుంతకల్లుటౌన్: ప్రయాణికుల భద్రత, గూడ్స్ రవాణాతో పాటు అన్ని విభాగాల్లోనూ గుంతకల్లు రైల్వే డివిజన్ ఆల్రౌండ్ ప్రతిభతో ప్రగతి పట్టాలపై దూసుకెళ్తోందని డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా అన్నారు. స్థానిక రైల్వే క్రీడామైదానంలో శనివారం 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను డీఆర్ఎం ఆవిష్కరించి ఆర్పీఎఫ్ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. డీఆర్ఎం మాట్లాడుతూ డివిజన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత ఆర్థిక సంవత్సరం 15.73 మిలియన్ టన్నుల లోడింగ్ను సాధించినట్లు వెల్లడించారు. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తం రూ.2,426 కోట్ల రాబడి ఆర్జించినట్లు ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే 14.6 మిలియన్ల ప్రయాణికుల రవాణా ద్వారా రూ.391 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. సమయ పాలనలో దక్షిణ కోస్తా రైల్వేలోనే మొదటి స్థానాన్ని కై వసం చేసుకోవడం గర్వంగా ఉందన్నారు. ఎలక్ట్రికల్ లోకో షెడ్ నిర్వహణ రైల్వేబోర్డు స్థాయిలోనే రెండో స్థానంలో ఉందని, అన్నిరంగాల్లోనూ ఆల్రౌండ్ ప్రతిభ కనబరుస్తూ డివిజన్ను ప్రగతి పట్టాలపై పరుగులు పెట్టిస్తున్న ఉద్యోగ, కార్మికులతో పాటు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రైల్వే భద్రతా బలగాలు, స్కౌట్స్ అండ్ గైడ్స్, రైల్వే హైస్కూల్ విద్యార్థుల కవాతు, ఆర్పీఎఫ్ డాగ్ స్క్వాడ్ విన్యాసాలు, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఏడీఆర్ఎం బీఎస్.శివప్రసాద్, ఉన్నతాధికారులు డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, రామ కృష్ణ, డీఎస్సీ జైస్వాల్, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా


