● చిత్తూరుపై అనంత జట్టు ఘన విజయం
అనంతపురం: జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో అనంత క్రీడాగ్రామం వేదికగా జరుగుతున్న ఏసీఏ సౌత్జోన్ మల్టీడే క్రికెట్ టోర్నీలో అర్టున్ టెండుల్కర్ వీరవిహారం.. బౌలర్ దీపక్ విజృంభణతో అనంత జట్టు విజయతీరాలకు చేరింది. మూడో రౌండ్ మ్యాచ్ల్లో భాగంగా ఏసీజీ మైదానంలో శుక్రవారం అనంతపురం, చిత్తూరు జట్లు తలపడ్డాయి. మొదటి ఇన్నింగ్స్లో చిత్తూరు జట్టు 196 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. 69 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో బ్యాటింగ్ను కొనసాగించిన అనంతపురం జట్టు 46.4 ఓవర్ల వద్ద 186 పరుగులకు ఆలౌట్ అయింది. పి. గిరినాథ్రెడ్డి 54 పరుగులు చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 32.5 ఓవర్ల వద్ద 155 పరుగులకు ఆలౌట్ అయింది. తేజారెడ్డి 58 పరుగులు, ధరణికుమార్ నాయుడు 53 పరుగులు తప్ప ఎవరూ రాణించలేదు. అనంత బౌలర్లలో ఎం.దీపక్ 42 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీశాడు. అనంతరం తన రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన అనంతపురం జట్లు 15.1 ఓవర్ల వద్ద ఒక్క వికెట్ కోల్పోయి 156 పరుగులు సాధించింది. బ్యాటర్ అర్జున్ టెండుల్కర్ 34 బంతుల్లో ఆరు ఫోర్లు, 8 సిక్సర్లతో వీరవిహారం సాగిస్తూ 82 పరుగులు సాధించాడు. దీంతో అనంత జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నెల్లూరు
వైఎస్సార్ కడప, నెల్లూరు జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో నెల్లూరు జట్టు ఆధిక్యత సాధించింది. గురువారం ఆట ముగిసే సమయానికి కడప జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 339 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. శుక్రవారం 339 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో ఆటను కొనసాగించిన కడప జట్టు 79.5 ఓవర్ల వద్ద 369 పరుగులకు ఆలౌట్ అయింది. వాసుదేవరాజు 171 పరుగులు సాధించి నాటౌట్గా నిలిచాడు. అనంతరం తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన నెల్లూరు జట్టు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసింది. సోహన్ వర్మ 154 పరుగులు , రోషన్ పవన్కుమార్ 103 పరుగులు చేశారు.
దీపక్
(7 వికెట్లు)
అర్జున్ టెండుల్కర్
(82 పరుగులు)


