● కడప సీఈ బాలచంద్రారెడ్డికి ఇన్చార్జ్ బాధ్యతలు
అనంతపురం సెంట్రల్: హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ (సీఈ) పోస్టుకు కె.నాగరాజ రాజీనామా చేశారు. ఆయన లేఖకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జనవరి నెలాఖరున ఆయన హంద్రీ–నీవా సీఈగా ఉద్యోగ విరమణ పొందారు. అయితే జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులు ఆయనే కావాలని పట్టుబట్టి మరీ పదవీకాలం పొడిగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఏడాదిపాటు ఆయన సేవలను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. గతంలో ఎప్పుడూ రిటైర్డు అయిన ఉద్యోగిని కొనసాగించలేదని, ఎలాంటి ఇబ్బందీ లేకుండా రూ.వేల కోట్లు హంద్రీ–నీవా లైనింగ్ పనుల బిల్లులు మంజూరు చేసుకోవడం కోసమే ఆయన్ను సీటులో ఉంచాలని ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ ఆయన నియామకం జరిగింది. అయితే ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన పనితీరుపై రాష్ట్ర ఉన్నతాధికారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రస్థాయి సమావేశంలో అన్ని జిల్లాల అధికారుల సమక్షంలో తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో నాగరాజ మనస్తాపం చెంది తాను కొనసాగలేనని రాజీనామా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వం ఆయన రాజీనామాను ఆమోదిస్తూ కడప చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్ట్స్) బాలచంద్రారెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశం జిల్లా జలవనరులశాఖలో హాట్టాపిక్ మారింది.
కె.నాగరాజ


