వజ్రకరూరు: రైతులు శాసీ్త్రయ సలహాలను తప్పక పాటించాలని జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారులు నరసింహులు, రుమానా తెలిపారు. గురువారం వజ్రకరూరు మండలంలో శాస్త్రవేత్తల బృందం విస్తృతంగా పర్యటించింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వజ్రకరూరు మండలంలోని పీసీ.ప్యాపిలి, గంజికుంట, కొనకొండ్ల, చాబాల గ్రామాల్లో పర్యటించి రైతులు సాగుచేసిన మొక్కజొన్న, పత్తి, కంది, వేరుశనగ, టమాట, ఆముదం, మిరప తదితర పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు ఎల్నినో ప్రభావం, నీటి, తేమసంరక్షణ, సమతుల్య ఎరువుల వినియోగం, సమగ్ర చీడపీడలు, యాజమాన్యం, వాతావరణ మార్పులకు అనుగుణమైన సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. పంటల్లో పోషక లోపాల నివారణకు 13.0.45 ఎరువును, సూక్షపోషక మిశ్రమాన్ని లీటరు నీటికి ఐదు గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలన్నారు. ఎల్నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తక్కువ కాలంలో పండే బెట్టను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా జొన్న, సజ్జ, రాగులు సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు యుగంధర్, శిరీషా, వింధ్య, బాంధవ్య, ఏఓ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.


