గుమ్మఘట్ట: మండలంలోని కలుగోడు ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. విద్యార్థులకు ఉపాధ్యాయులు ఆరుబయట విద్యాబోధన చేస్తున్నారు. పాఠశాలలో 234 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సరిపడా గదులు లేకపోవడంతో ఆరు బయట విద్యాబోధన చేయాల్సిన దుస్థితి నెలకొంది. మరుగుదొడ్లు, బాత్రూంలు కూడా లేకపోవడంతో అవస్థలు చెప్పనలవిగా మారాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించి నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలను పూర్తిగా మార్చివేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చిల్లిగవ్వ కూడా కేటాయించకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొందని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఎంఈఓ సోమశేఖర్ను వివరణ కోరగా ఆయన స్పందించారు. అదనపు తరగతి నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించామన్నారు. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
బీఎల్ఓలు, సూపర్వైజర్లకు గౌరవ వేతనం మంజూరు
అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో పాలుపంచుకున్న బీఎల్ఓలకు, 2021లో విధులు నిర్వర్తించిన సూపర్వైజర్లకు గౌరవ వేతనాన్ని ఎన్నికల సంఘం మంజూరు చేసింది. జిల్లాకు 1,69,20,000, శ్రీ సత్యసాయి జిల్లాకు రూ.1,19,80,000 విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఖాతాలో నిధులు జమ చేశారు. బీఎల్ఓకు రూ.7 వేలు, సూపర్వైజర్కు రూ.6 వేల చొప్పున గౌరవ వేతనం నిర్ణయించారు. జిల్లాలో 2,226 మంది బీఎల్ఓలకు రూ.1,55,82,000, సూపర్వైజర్లు 223 మందికి 13.38 లక్షలు మొత్తం రూ.1,55,82,000, శ్రీ సత్యసాయి జిల్లాలో 1,576 మంది బీఎల్ఓలకు రూ.1,10,32,000, సూపర్వైజర్లు 158 మందికి రూ.9.48 లక్షలు మొత్తం రూ.1,19,870,000 విడుదల చేశారు.


