బొమ్మనహాళ్: వర్షాభావంతో ఇబ్బంది పడుతున్న తుంగభద్ర ఆయకట్టు రైతులకు ఊరటనిచ్చే పరిణామం చోటు చేసుకుంది. తుంగభద్ర డ్యాం ఎగువ ప్రాంతమైన శివమొగ్గ జిల్లాలో కొద్ది రోజులుగా ఆశాజనకంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎగువన ఉన్న గాజనూరు జలాశయం (అప్పర్ తుంగ ప్రాజెక్ట్)లో నీటి నిల్వ గరిష్ట మట్టానికి చేరింది. అక్కడి ఇంజినీర్లు కొన్ని గేట్లను ఎత్తి 55,197 క్యూసెక్కుల నీటిని తుంగ నదిలోకి విడుదల చేశారు. ఆ నీరు దిగువన ఉన్న తుంగభద్ర డ్యాంకు శనివారం రాత్రికి చేరింది. ఆదివారం ఉదయానికల్లా జలాశయంలోకి నీటి ప్రవాహం 50 వేల క్యూసెక్కులకు పైగా పెరిగే అవకాశం ఉందని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. డ్యాంలో ప్రస్తుతం 38.69 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
హెచ్చెల్సీకి నీటి విడుదల
తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తుంగభద్ర జలాశయం నుంచి ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు శనివారం 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అంతకు ముందు అధికారులు డ్యాంపై పూజలు చేశారు. అనంతరం సంప్రదాయబద్ధంగా రైతులతో కలిసి వాయనం వదిలారు. డ్యాం నుంచి హెచ్చెల్సీకి నీటిని విడుదల చేసినట్లు జలాశయ ఈఈ ఎన్.చంద్రశేఖర్, ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు.


