గుంతకల్లు రూరల్: హుండీ కానుకల లెక్కింపు ద్వారా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి రూ.54,42,524 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు తెలిపారు. భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలను గురువారం ఆలయంలో లెక్కించారు. 77 రోజులకు రూ.54,42,524తో పాటు 14 గ్రాముల 300 మిల్లీ గ్రాముల మిశ్రమ బంగారం, 770 గ్రాముల వెండిని భక్తులు స్వామివారికి అందజేసినట్లు పేర్కొన్నారు. అలాగే బ్యాంక్ ఆఫ్ కెనడా 10 డాలర్లు, సెంట్రల్ బ్యాంక్ ఆరబ్ కంట్రీ 15 దీనమ్స్, యూఎస్ఏ 10 డాలర్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఈజిప్ట్ 50 పౌండ్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ 10 దినార్ లభించాయన్నారు. అన్నదానం హుండీ ద్వారా రూ.1,41,629 నగదును కూడా భక్తులు సమర్పించినట్లు పేర్కొన్నారు.


