ఉద్యోగుల హాజరు విధానంలో..
అనంతపురం క్రైం: రాష్ట్ర ప్రభుత్వ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై ప్రతి ఉద్యోగి రోజూ అవేర్ యాప్ డ్యాష్బోర్డులో లాగిన్ అయి విధులకు హాజరయ్యే సమయాన్ని నమోదు చేయడం తప్పనిసరి చేసింది. అలాగే సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య విధులను ముగించిన సమయాన్ని కూడా తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించింది. ఉద్యోగి స్వయంగా హాజరు నమోదు చేయలేని పరిస్థితి ఉంటే, సంబంధిత వేతన పంపిణీ అధికారి (డీడీఓ) తన ప్రవేశం ద్వారా హాజరు నమోదు చేసే అవకాశాన్ని కల్పించారు. అలా నమోదు చేసిన వివరాలు ఉద్యోగి వ్యక్తిగత నమోదులోనే ప్రతిబింబిస్తాయని స్పష్టం చేశారు. అధికారిక విధుల కోసం కార్యాలయానికి దూరంగా ఉన్న సందర్భాల్లో విధి క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తులను ఏడురోజుల్లోపు అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
హాజరు సమయాలు ఇలా...
ఉదయం 10:30 గంటల్లోపు హాజరు నమోదు చేయాలి. 10:31 నుంచి 10:40 గంటల వరకు గ్రేస్ పిరియడ్ ఉంటుంది. అనుమతితో నెలలో మూడుసార్లు మాత్రం 10:41 నుంచి 11:30 గంటల మధ్య విధులకు హాజరయ్యే అవకాశం ఇచ్చారు. మూడు సార్లు దాటితే దాన్ని సాధారణ సెలవుగా నమోదు చేస్తారు. 11:31 నుంచి మధ్యాహ్నం 2:00 గంటల మధ్య హాజరైనా ఆ రోజు సాధారణ సెలవుగానే పరిగణిస్తారు. మధ్యాహ్నం 2:01 నుంచి సాయంత్రం 5:00 గంటల మధ్య తొలిసారి హాజరైనా ఆ రోజును సాధారణ సెలవుగానే నమోదు చేయనున్నారు. ఈ నూతన విధానం ద్వారా ఉద్యోగుల్లో సమయ పాలన పెంపొందించడంతో పాటు హాజరు వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఆలస్యంగా వస్తే సెలవుగా నమోదు


