ఉరవకొండ: ‘రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్ని విధాలా రైతులకు అండగా ఉండాల్సిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకుండా విఫలమైంది. సీఎం చంద్రబాబు మరోసారి రైతుల ద్రోహిగా మిగిలారు’ అని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. గురువారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయం రంగం సంక్షోభంలో పడిందన్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 70 శాతం లోటు వర్షపాతం ఉందన్నారు. చెరువులు, బోర్లు నీటి మట్టాలు అడుగంటి పోయాయన్నారు. ఎన్నడూ లేని విధంగా నాగార్జున సాగర్ , తుంగభద్ర డ్యాముల్లో నీటి మట్టం డెడ్ స్టోరేజ్ పడిందన్నారు. రాయలసీమకు శ్రీశైలం నుంచి అందాల్సిన సాగు, తాగు నీరు అందించే పోతిరెడ్డిపాడు జలాశయం ఒట్టిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ధైర్యం చెప్పే పరిస్ధితి లేదన్నారు. శాస్త్రవేత్తలు ఎల్నినోపై ముందస్తుగా హెచ్చరించినా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. వేరుశనగ పంటకు సంబంధించి సగం విత్తనాలు కూడా అందించలేదని, రాష్ట్రంలో పొగాకు, ఆక్వా, టమాటతో పాటు రైతులు ఏ పంట పండించినా మద్దతు ధర లేదన్నారు.
బీమా గడువు పొడిగించాలి
జూలై 31తో బీమాకు గడువు ముగుస్తున్నా దాదాపు 1.50 లక్షల మంది రైతులు బీమా చేసుకోలేదని పేర్కొన్నారు. జిల్లాలో రైతులు 20 శాతం మాత్రమే వివిధ పంటలు సాగు చేశారని, మిగిలిన 80 శాతం మంది రైతులు ఏ పంటలూ సాగు చేయలేదన్నారు. కనీసం ప్రభుత్వం వద్ద ఎంత మంది రైతులు ఏ పంటలు సాగు చేశారు. లక్షలాది మంది రైతులు ఇన్సూరెన్స్కు దూరమైతే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. బీమా గడువు పొడిగించాలని డిమాండ్ చేశారు.
ఆగస్టు 3న నిరసన..
మంత్రి పయ్యావుల కేశవ్ అనుచరుల దౌర్జన్యాలకు నిరసనగా ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు సిద్దార్థ్, నాయకులు ఎర్రిస్వామిరెడ్డి, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, ఓబన్న తదితరులు పాల్గొన్నారు.
పయ్యావుల దౌర్జన్యాలకు నిరసనగా
3న తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు
వై.విశ్వేశ్వరరెడ్డి


