అనంతపురం అర్బన్: ‘నియోజకవర్గస్థాయిలో బాలబాలికలకు (అండర్–14) ఆగస్టు 17, 18 తేదీల్లో క్రీడా పోటీలు నిర్వహించాలి. ఇందుకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేయండి’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ వ్యాయమ ఉపాధ్యాయులను ఆదేశించారు. స్పోర్ట్స్ చాంపియన్ షిప్–2026 అండర్–14 క్రీడా పోటీల నిర్వహణపై కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మండలస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు ఆగస్టు 17, 18 తేదీల్లో నియోజకవర్గస్థాయిలో పోటీలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో పొల్గొనే క్రీడాకారులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో డీఎస్డీఓకి ఆర్డీటీ సంస్థ క్రీడా సామగ్రిని అందజేసింది. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీఎస్డీఓ మంజుల, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయి, ఇతర శాఖల అధికారులు పాల్గొనారు.
పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్న
కలెక్టర్ ఆనంద్


