● 24 వరకు బీఎల్ఓల ఇంటింటి సర్వే, ఈఎఫ్ డిజిటలైజేషన్
● 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ
అనంతపురం అర్బన్: ఓటరు జాబితా సవరణకు సంబంధించి చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) గడువును భారత ఎన్నికల కమిషన్ పది రోజులు పొడిగించింది. తొలి షెడ్యూల్ ప్రకారం ఈనెల 14వ తేదీతో బీఎల్ఓల ఇంటింటి సర్వే చేపట్టి ఎన్యుమరేషన్ ఫారాల (ఈఎఫ్) పంపిణీ, వాటి డిజిటలైజేషన్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ వ్యవధిని మరో 10 రోజుల పాటు పొడిగించారు. ఈనెల 24 తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఈఎఫ్లు డిజిటలైజేషన్ చేస్తారు. అదే క్రమంలో ఓటర్ల ముసాయిదా జాబితాను 31వ తేదీన ప్రచురిస్తారు. అదే రోజు నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు కొత్తగా ఓటర్ల నమోదు, వివరాల మార్పు, ఓట్ల తొలగింపునకు సంబంధించి క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని సెప్టెంబరు 28వ తేదీలోగా పరిష్కరించి ఓటర్ల తుది జాబితాను అక్టోబరు 3వ తేదీన ప్రచురిస్తారు.
డిజిటలైజేషన్ దాదాపు పూర్తి
జిల్లాలో 20,38,523 మంది ఓటర్లు ఉండగా, ఎన్యుమరేషన్ ఫారాలు అందరికీ అందజేశారు. ఇప్పటి వరకు 2,08,791 ఈఎఫ్లు వెనక్కి రాలేదు. ఇక మంగళవారం నాటికి 18,29,706 ఈఎఫ్లు డిజిటలైజేషన్ చేశారు. ఈ ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం పది రోజుల పాటు గడువు పొడిగించిన నేపథ్యంలో బీఎల్ఓలు షిఫ్టెడ్ ఓట్లకు సంబంధించి ఫారాలు అందితే డిజిటలైజేషన్ చేస్తారు.
ముందే చెప్పిన ‘సాక్షి’..
‘సర్’ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఓటర్ల ఎన్యుమరేషన్ ప్రక్రియ ద్వారా జిల్లావ్యాప్తంగా 2.26 లక్షలకు పైగా ఓట్లు తగ్గే అవకాశం ఉందని ‘సాక్షి’ ఈనెల 9వ తేదీన ప్రత్యేక కథనం ప్రచురించింది. జిల్లాలో 20,38,523 మంది ఓటర్లకు ఈఎఫ్లు పంపిణీ చేస్తే 2,08,791 ఈఎఫ్లు వెనక్కి రాలేదు. అంటే ఈ రెండు లక్షల ఓట్లు ముసాయిదా జాబితాలో ఉండవు. ఇక డబుల్ ఓట్లు, మరణించిన, షిప్టెడ్, శాశ్వత వలస వెళ్లిన వారి ఓట్లు మరో 25 వేల వరకు ఉండే అవకాశం ఉంది. మొత్తంగా 2.25 లక్షల నుంచి 2.50 లక్షల మధ్య ఓట్లు తగ్గే అవకాశం ఉన్నట్లు ఉన్నతాధికారులు ధ్రువీకరిస్తున్నారు.


