న్యూస్రీల్
● డిజిటలైజేషన్ వ్యవహారంపై విచారణకు కలెక్టర్ ఆదేశం
రాప్తాడు రూరల్: రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి 130వ పోలింగ్ బూత్లో ఓటర్ల ప్రమేయం లేకుండానే డిజిటలైజేషన్ పూర్తి చేసిన వ్యవహారంపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ఈ ఘటనపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని కలెక్టర్ ఓ. ఆనంద్ తీవ్రంగా పరిగణించి విచారణకు ఆదేశించారు. మంగళవారం సంబంధిత బూత్ లెవల్ అధికారి (బీఎల్ఓ)కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి వాస్తవాలను వెలికి తీస్తా మని నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, ఆర్డీఓ రామ్మోహన్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) ప్రక్రియకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. ఓటర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎక్కడైనా తప్పిదాలు జరిగితే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
నేడు కలెక్టరేట్లో
పరిష్కార వేదిక
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని బుధవారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ. ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. పరిష్కార వేదికలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్లో భూ సమస్యల అర్జీలను అక్కడి అధికారులకు అందజేయాలన్నారు. ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ప్రజలు తమ అర్జీ పరిష్కార స్థితిని కాల్ సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam. ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు.


