అనంతపురం న్యూటౌన్: జిల్లాలోని 31 మండలాల్లో 83 స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎస్డబ్ల్యూ అధికారి జి. నాసర రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని స్వర్ణగ్రామ– స్వర్ణవార్డు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 17వ వరకూ, తిరిగి 21 నుంచి 24 వరకూ ప్రత్యేక ఆధార్ కేంద్రాలు పని చేస్తాయన్నారు. ఇప్పటికే నిర్దేశిత పాఠశాలలు, జూనియర్ కళాశాలలను గుర్తించినట్లు తెలిపారు. పాఠశాల, ఇంటర్మీడియెట్ విద్యార్థులే అధికంగా ఉన్నారని, వీరంతా తప్పని సరిగా బయోమెట్రిక్ను ప్రత్యేక ఆధార్ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని కోరారు. యువతే కాకుండా సెల్ నంబర్ మార్పు, ఆధార్ కార్డులో చిరునామా, వయస్సు ఇతరత్రా మార్పులను చేసుకోవచ్చని తెలిపారు.


