అనంతపురం: వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన ముద్రగడ పద్మనాభం మృతి బాధాకరమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతికి సంతాపం తెలిపారు. కాపు సామాజికవర్గ హక్కుల పోరాటాల్లో ముద్రగడది కీలకపాత్ర అని కొనియాడారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేశారని.. మంత్రిగానూ తనదైన ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గంలోనే కాకుండా అన్ని వర్గాల్లో ముద్రగడకు అభిమానులున్నారన్నారు. ఓ మంచి వ్యక్తిని వైఎస్సార్ సీపీ కోల్పోయిందని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
చిరస్మరణీయ సేవలు..
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయసేవలు అందించిన ముద్రగడ పద్మనాభం విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. పదవుల కన్నా ప్రజాసేవే గొప్పగా భావించిన వ్యక్తి అని ప్రశంసించారు. జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారన్నారు. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపమని, ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థించారు.


