● తాత్కాలిక బదిలీలతో కుటుంబాలకు ఇబ్బందులు
● నగరంలో కొత్త టీచర్లకు చుక్కలు
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వం చేపట్టిన తాత్కాలిక ఉపాధ్యాయుల సర్దుబాటు పలువురు ఉపాధ్యాయుల కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఉరవకొండ హిందీ టీచర్ ఎ. వేదావతి తన 27 ఏళ్ల మేధో వైకల్యంతో ఉన్న కుమార్తెను చూసుకోవాల్సిన పరిస్థితిని వివరిస్తూ సోమవారం డీఈఓ శ్రీనివాసరావు ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు 2025 డీఎస్సీ ద్వారా నియమితులైన ఎస్జీటీలు తమను ఏడాది పాటు ఒకచోట పనిచేయించి, ఇప్పుడు దూర ప్రాంతాలకు పంపడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కుమార్తెను ఎవరు చూసుకుంటారు?
ఉరవకొండ పట్టణంలోని పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఎ.వేదావతిని మండలంలోని వెలిగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. తన 27 ఏళ్ల మేధో వైకల్యంతో ఉన్న కుమార్తెను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలకు ఆమెను వెంట తీసుకెళ్తున్నానని, కొత్త పాఠశాలకు ప్రయాణ సౌకర్యం కూడా లేదని డీఈఓ శ్రీనివాసరావును కలిసి విన్నవించారు. తనను ప్రస్తుత పాఠశాలలోనే కొనసాగించాలని వేడుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై స్పందించిన డీఈఓ, ప్రభుత్వ నిబంధనల మేరకే సర్దుబాట్లు జరిగాయని, సమస్యను ఆర్జేడీ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
కొత్త టీచర్లకు చుక్కలు
2025 డీఎస్సీ ద్వారా ఎంపికై న ఎస్జీటీలను కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలల్లో ఏడాది పాటు బోధనకు వినియోగించుకున్న అధికారులు, ఇప్పుడు తాత్కాలిక సర్దుబాటు పేరిట కదిరి, గోరంట్ల, రాయదుర్గం, శెట్టూరు, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి తదితర ప్రాంతాలకు పంపడం కొత్త టీచర్లలో తీవ్ర ఆవేదనకు కారణమైంది. ఖాళీలు లేవని తెలిసినా కార్పొరేషన్ పాఠశాలల్లో ఏడాది పాటు సేవలు వినియోగించుకున్న అధికారులు, ఇప్పుడు అర్హత లేదంటూ ఇతర పాఠశాలలకు పంపడం అన్యాయమని టీచర్లు వాపోతున్నారు. నగరంలోనే 30 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, వాటిలో 6, 7 తరగతుల బోధనకు తమ సేవలను వినియోగించుకోవచ్చంటున్నారు.
ర్యాంకు రావడమే శాపమైంది
కార్పొరేషన్ ఆప్షన్ ఇవ్వడం వల్ల నగరంలోనే ఉద్యోగం కొనసాగుతుందనే ఆశతో ఎంపిక చేసుకున్నామని, అప్పుడే వాస్తవ ఖాళీలు చూపించి ఉంటే ఇతర మేనేజ్మెంట్ పాఠశాలల్లో మంచి అవకాశం లభించేదని కొత్త టీచర్లు వాపోతున్నారు. ‘ర్యాంకు రావడమే మా తప్పా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఇది అన్యాయం


