● పదుకొండున్నర తులాల బంగారు, రూ.64 వేల నగదు అపహరణ
కూడేరు: తాళం వేసిన రెండిళ్లలో దొంగలు చొరబడి పదుకొండున్నర తులాల బంగారం, రూ.64 వేల నగదును ఎత్తుకెళ్లిన ఘటన కూడేరు మండలం ఉదిరిపికొండలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు మేరకు.. ఉదిరిపికొండలో శర్మాస్ వలి కుటుంబం శుక్రవారం ఇంటికి తాళం వేసి అనంతపురంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అలాగే పక్కనే ఉన్న నూర్బాషా కుటుంబం కూడా శనివారం ఇంటికి తాళం వేసి గుంతకల్లులో జరుగుతున్న మస్తానయ్య ఉరుసుకు వెళ్లారు. ఆ ఇళ్లలో ఎవరూ లేరని గుర్తించిన దొంగలు ఆదివారం రాత్రి దొంగతనాలకు తెగబడ్డారు. అయితే ముందుగా ఆయా ఇళ్లకు సమీపంలో ఉన్న మూడిళ్లకు చెందిన వారు శబ్ధాలకు బయటకు రాకుండా వారిళ్లకు కూడా ముందు గడియపెట్టారు. ఆ తర్వాత శర్మస్, నూర్బాషా ఇళ్ల తాళాలను కట్టర్తో కట్ చేసి లోపలికి వెళ్లారు. శర్మాస్ వలి ఇంట్లోని బీరువాలో దాచిన 10 తులాల బంగారం, రూ.10 వేలు నగదు, నూర్బాషా ఇంట్లో ఒకటిన్నర తులం బంగారం, రూ.64 వేలు నగదును ఎత్తుకెళ్లారు. బాధితులు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


