● ఆరుగురికి గాయాలు
శింగనమల: మండలంలోని సీ.బండమీదపల్లిలో టీడీపీకి చెందిన ఇరువర్గాలు దాడులు చేసుకోవడంతో ఆరుగురు గాయపడిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. ఆదివారం గ్రామంలో జరిగిన పీర్ల పండుగలో ఆదిశేఖర్, శ్రీకాంత్ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అయితే సోమవారం ఇరువర్గాలకు చెందిన వారు కట్టెలు, కొడవళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఆదిశేఖర్, అక్కులప్ప, బయ్యన్న, శ్రీకాంత్, అరుణకుమార్, ఆదినారాయణ తీవ్రంగా గాయపడగా వారిని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రసాద్ సంఘటనా స్థలానికి వెళ్లి ఇరువర్గాలతో ఘర్షణపై విచారణ చేపట్టారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.


