భోళా శంకర్‌ సినిమాకు వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు | - | Sakshi
Sakshi News home page

భోళా శంకర్‌ సినిమాకు వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు

Aug 13 2023 1:42 AM | Updated on Aug 13 2023 8:33 AM

- - Sakshi

రెండో శనివారం సెలవు కావడంతో చిరంజీవి నటించిన భోళా శంకర్‌ సినిమా చూసేందుకు పావగడ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

అనంతపురం: సినిమా చూసేందుకు ఉత్సాహంగా బయలుదేరిన ముగ్గురు మిత్రులు మార్గమధ్యంలోనే రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. ఇందులో ఇద్దరు దుర్మరణం చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. శనివారం ఉదయం కర్ణాటక రాష్ట్రం పావగడ సమీపంలోని కడమలకుంటె గ్రామం గేటు వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రొద్దం మండలం చిన్నకోడిపల్లి గ్రామానికి చెందిన కురుబ అంజినప్ప కుమారుడు ఈశ్వర్‌ (15), కురుబ ధనుంజయ కుమారుడు జశ్వంత్‌(15), చాకిల పరమేష్‌ కుమారుడు రాము మిత్రులు.

ఈశ్వర్‌, జశ్వంత్‌ పదో తరగతి, రాము ఇంటర్‌ చదువుతున్నారు. రెండో శనివారం సెలవు కావడంతో చిరంజీవి నటించిన భోళా శంకర్‌ సినిమా చూసేందుకు పావగడ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జశ్వంత్‌ బైక్‌పై ముగ్గురూ స్వగ్రామం నుంచి బయలుదేరారు. కడమలకుంటె గ్రామం గేటు వద్దకు రాగానే పావగడ నుంచి రొద్దం వైపు వేగంగా వెళ్తున్న బొలెరో (ఏపీ 39టీవీ 2258) వాహనం వీరి బైక్‌ను ఢీ కొంది. ముగ్గురూ కింద పడిపోయారు. బైక్‌పై ఉన్న ఈశ్వర్‌, జశ్వంత్‌ తలలు పగిలి తీవ్రరక్తస్రావం కాగా, వారు ఘటనా స్థలంలోనే మృతి చెందారు.

తీవ్రంగా గాయపడిన రామును స్థానికులు పావగడ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. స్థానిక సీఐ అజయ్‌ సారథి సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈశ్వర్‌, జశ్వంత్‌ మృతితో చిన్నకోడిపల్లిలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చిన కుమారులు ఇలా అర్ధంతరంగా రోడ్డుప్రమాదంలో దుర్మరణం చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement