అనకాపల్లి టౌన్: ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతిని స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సబ్ డివిజన్ ఇన్చార్జి డీఎస్పీ జి.ఆర్.ఆర్. మోహన్ మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమ సమయంలో బ్రిటిష్ వారిని ఎదుర్కొని నిలబడ్డారని కొనియాడారు. నిజాయతీ, సత్యనిష్ఠ, నైతిక విలువలతో కూడిన ప్రకాశం పంతులు జీవితం నేటి యువతకు, ప్రజా ప్రతినిధులకు, ఉద్యోగులకు ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.


