గౌరవ వందనం స్వీకరిస్తున్న వీఎపీఏ చైర్మన్ జేఎస్ బింద్రా
సీతంపేట(విశాఖ): పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు పోర్ట్ గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో వైభవంగా జరిగాయి. చైర్మన్ జె.ఎస్. బింద్రా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సీఐఎస్ఎఫ్ పరేడ్ను పరిశీలించి సెల్యూట్ స్వీకరించారు. మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047లో భాగంగా సాధిస్తున్న ప్రగతిని ప్రస్తావిస్తూ.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో పోర్ట్ చరిత్రలోనే అత్యధికంగా 91.17 ఎంఎంటీల కార్గోను నిర్వహించి 10.34 శాతం వృద్ధి సాధించినట్టు బింద్రా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్,జూలైలో 32.10 ఎంఎంటీల నిర్వహణతో 13 శాతం వృద్ధి నమోదైంది. జూన్ 5న 292 మీటర్ల కేప్సైజ్ నౌక బెర్తింగ్, 24 గంటల్లో 24 నౌకల రాకపోకలు, ఒకే రోజు 5.5 లక్షల టన్నుల కార్గో నిర్వహణ వంటి మైలురాళ్లను ఆయన ప్రస్తావించారు. దేశ సముద్ర ఆహార ఎగుమతుల్లో దాదాపు 50 శాతం ఈ పోర్ట్ ద్వారానే జరుగుతుండగా, 4 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం అందుతోందని చెప్పారు. రూ.178 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, ఈ ఏడాది 100 ఎంఎంటీల మైలురాయిని అధిగమిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిభావంతులైన ఉద్యోగులు, వాటాదారులకు అవార్డులు అందజేశారు.


