అనకాపల్లి/మునగపాక : కాపు ఉద్యమ నాయకునిగా ప్రజా నాయకునిగా రాష్ట్ర రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం చెరగని ముద్ర వేసుకున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. మంగళవారం రాత్రి ఆయన సాక్షితో మాట్లాడారు. కాపు రిజర్వేషన్ల అమలు కోసం రాజీలేని పోరాటం చేసిన ముద్రగడ మృతి బాధాకరమన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఆయన మరణం రాష్ట్ర ప్రజలకు తీరనిలోటన్నారు. పద్మనాభం రాజకీయ ప్రస్థానం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు. ఆయనతో తనకు ఉన్న వ్యక్తిగత అనుబంధం ఎప్పటికీ మరిచిపోలేనని, ఆయన మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నానని బొడ్డేడ పేర్కొన్నారు. ఆయనకు ఘన నివాళులర్పించేందుకు అనకాపల్లి పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు హాజరుకావాలని కోరారు.
నేడు సంతాప సభకు హాజరుకండి
మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతి పార్టీకి తీరనిలోటని, ఈనెల 15న అనకాపల్లి రింగ్రోడ్డు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు సంతాప సభ నిర్వహించడం జరుగుతుందని ఆ పార్టీ నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


