ఆదిలాబాద్టౌన్: ఆదివాసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీలో వేలాది మంది గిరిజనులు గళమెత్తారు. ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని సాయి పార్క్లో సోమవారం ధర్నా, ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. దేశంలోని 21 రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐదు, ఆరో షెడ్యూళ్లను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, అటవీ హక్కుల చట్టం, పెసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఏజీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ అటవీ సంరక్షణ చట్టం–2023తో ఆదివాసీ గ్రామసభల హక్కులకు భంగం కలిగే పరి స్థితి ఏర్పడిందన్నారు. మైనింగ్ పేరుతో ఆదివాసీ లను భూముల నుంచి తరలించడం నిలిపివేయాలని, అడవులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించరాదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ చైర్మన్ జితిన్ చౌదరి, జాతీయ కన్వీనర్, మాజీ ఎంపీ ఫు లీన్ బిహారి బస్కే, జాతీయ ఉపాధ్యక్షురాలు బృందాకర్, మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి.వెంకట్, టీజేజీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు, ఉపాధ్యక్షులు సక్కు, పెందూర్ గోవింద్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ఆత్రం బాపూరావు, కార్యదర్శి తొడసం శంబు, తదితరులు పాల్గొన్నారు.


