కై లాస్నగర్: వంటగ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. వినియోగదారులు ఇకపై 45 రోజుల వరకు నిరీక్షించాల్సిన అవసరం లేదు. 25 రోజులకు తగ్గిస్తున్నట్లుగా ప్రకటించి సోమవారం నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఊరట కలగనుంది. కేంద్ర నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరిగిందంటే ..
ఇటీవల పశ్చిమాసియాలో ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా హోర్మూజ్ నుంచి ఇంధన రవాణాకు అంతరాయం ఏర్పడింది. సరిపడా గ్యాస్ సరఫరా కాకపోవడంతో జిల్లాలో వినియోగదారులు సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ కొరత ఏర్పడుతుందో అని కొంతమంది అవసరం లేకున్నా ముందుగానే బుకింగ్ చేసుకున్నారు. దీంతో వాస్తవంగా అవసరమైన వారికి గ్యాస్ లభించని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో వినియోగదారులందరికీ సిలిండర్లను అందించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ ఏడాది మార్చిలో బుకింగ్ గడువులో మార్పులు చేసింది. పట్టణ ప్రాంతాల్లోని వారికి 25 రోజులకే అవకాశాన్ని కల్పించగా గ్రామీణ ప్రాంతాల్లో వారికి మాత్రం 45 రోజులకు పొడిగించింది. ఈ క్రమంలో గ్యాస్ వినియోగం అధికంగా ఉండే పెద్ద కుటుంబాలకు సిలిండర్ కోసం నిరీక్షించాల్సి వచ్చింది.
ఇకపై 25 రోజులకే..
యుద్దం ముగియడంతో గ్యాస్ సరఫరా యథావిధంగా జరగడంతో పాటు బుకింగ్ సిలిండర్ల పెండింగ్ సైతం తగ్గిపోవడంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా బుకింగ్ గడువును మార్పు చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులందరికీ ఒకే విధంగా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆరు నెలలుగా కొనసాగిన 45 రోజుల బుకింగ్ గడువును 25 రోజులకు కుదించడంతో గ్రామీణ ప్రాంతాల వారి ఇక్కట్లకు ఇక తెరపడింది.
జిల్లాలో
గ్యాస్ ఏజెన్సీలు 17
ఎల్పీజీ కనెక్షన్లు 2,14,413
ఉజ్వల 36,960
జనరల్, దీపం 1,77,453
నెలకు వినియోగమయ్యే
సిలిండర్లు 80వేలు


