మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో సంచారం
తిప్పేశ్వర్ నుంచి వచ్చి మకాం
జీవాలపై పంజా విసురుతున్న బెబ్బులి
ఆందోళనలో అటవీ సమీప గ్రామాల ప్రజలు
తాంసి: జిల్లాలో పులుల సంచారం పెరిగింది. ఇ టీవల వరుసగా ఎక్కడో ఓ చోట బెబ్బులి తారసపడుతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది. తిప్పేశ్వర్ పులుల అభయారణ్యం నుంచి పెన్గంగ దాటి వచ్చిన పులులు నెలల తరబడి జిల్లాలోనే తిష్ట వేస్తున్నాయి. అటవీ సమీప గ్రామాల శివారులో సంచరిస్తూ పశువులపై పంజా విసురుతున్నాయి. ఈక్రమంలో పశువులకాపరులు, చేలకు వెళ్లేందుకు రైతులు,కూలీలు జంకుతున్నారు.
సరిహద్దు మండలాల్లోనే..
తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన పులులు జిల్లాలోని భీంపూర్, తాంసి, తలమడుగు, బజార్హత్నూర్తో పాటు బోథ్ మండలాల్లోనే ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఈ మండలాల్లో అటవీప్రాంతం ఎక్కువగా ఉండటంతో మాకాం వేస్తున్నట్లు తెలుస్తోంది. తరచూ సమీప గ్రామాల పంటచేలకు వస్తూ పశువులపై దాడులకు పాల్పడుతున్నాయి.
అటవీశాఖ అప్రమత్తం..
జిల్లాలో ఆయా ప్రాంతాల్లో వరుసగా పులులు సంచరిస్తుడటంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమవుతున్నారు. విషయం తెలియగానే బేస్క్యాంప్లు ఏర్పాటు చేస్తూ పులి కదలికలు, జాడ కోసం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వేటగాళ్ల ద్వారా టైగర్కు ఎలాంటి అపాయం కలగకుండా ప్రత్యేక ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అటవీ సమీప గ్రామాల్లో ప్రజలకు సైతం అవగాహన కల్పిస్తున్నారు. చేలకు గుంపులుగా వెళ్లాలని, అటవీ జంతువులు, పులి కనిపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు.


