ఆదిలాబాద్: 22–ఏ భూముల విషయంలో రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. 22–ఏ భూముల జాబితా నుంచి రైతుల భూములను తొలగించి, వారికి సంపూర్ణ హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ‘చలో ఇందిరాపార్క్’ నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలంతా 22–ఏ భూముల అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి, రైతుల తరఫున బలంగా తమ వాణిని వినిపిస్తామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


