అక్టోబర్ మూడో వారంలో ప్రారంభించేలా సీసీఐ ఏర్పాట్లు
కనీస మద్దతు ధర పెంపు
కపాస్ కిసాన్ యాప్ ద్వారా విక్రయాలు
సాక్షి,ఆదిలాబాద్: పత్తి కొనుగోళ్లకు సంబంధించి భారత పత్తి సంస్థ (సీసీఐ) సన్నద్ధమవుతుంది. ప్రణాళిక మేరకు కొనుగోలు కేంద్రాలు, మౌలిక వసతుల ఏ ర్పాటు వంటి అంశాలపై దృష్టి సారించింది. జిల్లాలో అక్టోబర్ మూడో వారంలో కొనుగోళ్లు షురూ చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ వానా కాలం పత్తి పంట అంచనా లకు అనుగుణంగా సాగైంది. అక్టోబర్లో దిగుబడులు చేతికందనున్నాయి. ఈమేరకు సీసీఐ ఏర్పాట్లను ప్రారంభించింది. జిల్లాలో గతేడాది మా దిరిగానే 11 కేంద్రాల ద్వారా పత్తిని సేకరించనున్నారు. ఆదిలాబాద్లో 2, బోథ్, నేరడిగొండ, పొచ్చెర, సొనాల, ఇంద్రవెల్లి, నార్నూర్, గుడిహత్నూర్, ఇచ్చోడ, బేలలో ఒక్కోటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు.
జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లులతో అనుసంధానం
రైతులకు ఇబ్బందులు కలగకుండా సీసీఐ ఏటా జిల్లాలో జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులను అద్దెకు తీసుకుని అక్కడే పత్తి కొనుగోళ్లు చేపడుతుంది. ఆధునిక జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లులను ఇటీవల అద్దెకు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియను సీసీఐ ప్రారంభించింది. సేకరించిన పత్తి ద్వారా అదే జిన్నింగ్లో పత్తి బేల్స్ తయారు చేయడం జరుగుతుంది. వాటిని భద్రపర్చడానికి గోదాంలను అద్దెకు తీసుకుంటుంది. గతేడాది జిల్లాలో 34 మిల్లులను సీసీఐ అద్దెకు తీసుకుంది. లోడింగ్ ఆన్లోడింగ్, రవాణాకోసం కూలీలను నియమించింది. ఇలా ఒక్కో ప్రక్రియను కొనుగోళ్లు మొదలు పెట్టే సరికి పూర్తి చేసేలా సీసీఐ ప్రణాళిక ప్రకారం సాగనుంది.
మద్దతు ధర పెంపు ..
క్రాప్ బుకింగ్ డేటా ఆధారంగానే..
కేంద్ర ప్రభుత్వం పత్తికి సంబంధించి ఈ ఏడాది మద్దతు ధర పెంచింది. గతేడాది పొడువు పింజ పత్తి క్వింటాల్కు రూ.8,110 ఉండగా ఈ సారి రూ.557 పెంచారు. గతేడాదితో పోల్చితే 6.9 శాతం పెరుగుదల ఉంది. పత్తిలో తేమ శాతం 8నుంచి 12 మధ్య ఉంటేనే నిర్ణీత మద్దతు ధర లభిస్తుంది. తేమ శాతం పెరిగితే నిబంధనల ప్రకారం సీసీఐ ధరలో కోత పెడుతుంది. సేకరించిన పత్తికి సంబంధించి నగదును నేరుగా రైతుల ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలోకి డీబీటీ పద్ధతి ద్వారా జమ చేస్తుంది.
పంటల సాగు విస్తీర్ణానికి సంబంధించి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్రాప్ బుకింగ్ ఏటా చేపడుతారు. కాటన్ ఫార్మర్ యాప్లో నమోదు చేసిన విస్తీర్ణం, క్రాప్ బుకింగ్ డేటా ఆధారంగానే సీసీఐ కొనుగోళ్లు సాగుతాయి. అక్టోబర్లో పంట చేతికి వచ్చే సమయానికి కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు.


