పశువులను తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

పశువులను తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

Sep 5 2026 1:44 AM | Updated on Sep 5 2026 1:44 AM

● టోల్‌ప్లాజా సిబ్బందిపై హత్యాయత్నం చేసిన నిందితులు ● వివరాలు వెల్లడించిన ఇచ్చోడ సీఐ సీహెచ్‌ రమేశ్‌

నేరడిగొండ: రోల్‌మామడ టోల్‌ప్లాజా వద్ద విధుల్లో ఉన్న సిబ్బందిపైకి వాహనాలు ఎక్కించి హత్యాయత్నానికి పాల్పడటంతో పాటు, అక్రమంగా గోవులను తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నేరడిగొండ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చోడ సీఐ సీహెచ్‌ రమేశ్‌ వివరాలు వెల్ల డించారు. ఈనెల 1న నేరడిగొండ నుంచి నిర్మల్‌ వైపు వెళ్తున్న మహీంద్రా బొలెరో టోల్‌గేట్లను ఢీకొడుతూ వేగంగా దూసుకెళ్లింది. టోల్‌ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా, వారిని చంపాలనే ఉద్దేశంతో వాహనాన్ని వారిపైకి తీసుకెళ్లారు. వెనుక వస్తున్న కంటైనర్‌ లారీ కూడా సైన్‌ కోన్లు, డివైడర్లను ఢీకొట్టి వేగంగా పరారైంది. టోల్‌ప్లాజా సూపర్‌వైజర్‌ ఎంపల్లి రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా 3వ తేదీ తెల్లవారుజామున కుంటాల గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆదిలాబాద్‌లో మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఆదిలాబాద్‌ తాటిగూడకు చెందిన ఎండీ షఫీ ముదస్సిర్‌, గోపాల్‌ సింగ్‌ షెకావత్‌, మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన లారీ డ్రైవర్‌ ఫిర్దోస్‌ బేగ్‌, మహమ్మద్‌ హైదర్‌అలీ, క్షితిజ్‌ భీమ్‌రావు సేవట్కర్‌, యవత్మాల్‌కు చెందిన సందీప్‌ విఠల్‌ ముప్పిడివార్‌లను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మహమ్మద్‌ మజార్‌, రాజు, రవి జగదీశ్‌ బాగ్డేల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ప్రాంతంలో దొంగిలించిన పశువులను లారీలో నిజామాబాద్‌ జిల్లా సతాపూర్‌ వైపునకు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి 24 ఎద్దులు, 23 ఆవులను మొత్తం 47 పశువులు స్వాధీనం చేసుకున్నారు. ఊపిరాడక మూడు పశువులు మృతిచెందగా, మిగిలిన 44 పశువులను సురక్షితంగా గోశాలకు తరలించారు. వీటితో పాటు బొలెరో, కంటైనర్‌ లారీ, 4 గ్రాముల గంజాయి, ఐఫోన్‌ 16 సహా పలు సెల్‌ఫోన్లు, రూ.6,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి బోథ్‌ జ్యూడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. నేరడిగొండ ఎస్‌సై ఇమ్రాన్‌ ఖాన్‌ ఉన్నారు.

వివరాలు వెల్లడిస్తున్న ఇచ్చోడ సీఐ రమేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement