గుడిహత్నూర్: విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని వైజాపూర్ గ్రామానికి చెందిన కనక విలాస్ (38) ఇటీవల కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. మంగళవారం ఉదయం ఇంటి గోడలకు నీరు పట్టడానికి మోటార్ ఆన్ చేయడానికి కరెంటు తీగలను బోర్డులో పెడుతుండగా ప్రమాదవశాత్తు తీగలు చేతికి తగిలి షాక్కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అంబులెన్సులో రిమ్స్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుని భార్య కనక లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
వైన్షాపు వద్ద ఒకరు ..
బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని ఓ వైన్షాపు ఎదుట మంగళవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాసర మండలం కిర్గుల్ (బి) గ్రామానికి చెందిన అలిశెట్టి విజయ్ (35) సోమవారం రాత్రి వైన్షాపు ఎదుట నిద్రించి అక్కడే మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుని సోదరుడు సాయినాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ, సీఐ దీపక్ తెలిపారు.
గుండెపోటుతో చిన్నారి..
నస్పూర్: గుండెపోటుతో చిన్నారి మృతి చెందిన సంఘటన మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం నస్పూర్ గేట్ సమీపంలో నివాసం ఉంటున్న ఎండీ జావిద్ కుమార్తె ఎండీ నహేదా (9) జిల్లా కేంద్రంలోని ఆర్బీహెచ్వి స్కూల్లో మూడోతరగతి చదువుతోంది. మంగళవారం ఉదయం నిద్ర నుండి లేచిన తర్వాత చాతి, వీపులో నొప్పి వస్తుందని చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా వాంతులు, మూత్ర విసర్జన చేసుకుని ఒక్కసారిగి కుప్పకూలిపోయింది. ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన చికిత్స కోసం మాతాశిశు కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.


