ఆదిలాబాద్టౌన్: సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణ కోసం విద్యార్థులు, యువత ఐక్యంగా పోరాడాలని ఓయూ ప్రొఫెసర్ ఖాసీం అన్నారు. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆర్అండ్బీ విశ్రాంతి భవనం వద్ద బుధవారం విద్యార్థి, యువజన పోరుగర్జన సభ నిర్వహించారు. కాగా, ఇదే ప్రాంగణంలో కొనసాగుతున్న రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరాయి. ముందుగా సీసీఐ ఫ్యాక్టరీ ప్రారంభం నుంచి మూతపడే వరకు జరిగిన పరిణామాలు వివరించేలా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను నాయకులు పరిశీలించారు. ఈసందర్భంగా ఖాసీం మాట్లాడుతూ, యువత సంకల్పిస్తే హక్కులను సాధించుకోవచ్చన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమ పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని కోరారు. సీసీఐ పునఃప్రారంభానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉద్యమాన్ని కొనసాగిస్తామని మాజీ రామన్న స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్, ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేస్రం భాస్కర్, బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్, పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఏఎస్యూ రాష్ట్ర కార్యదర్శి సలాం వరుణ్, టీఏజీఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్, సీసీఐ సాధన కమిటీ ప్రతినిధులు, విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.


