ఉట్నూర్రూరల్: మెదక్ జిల్లా నర్సాపూర్లో ఇంజినీరింగ్ చదువుతున్న ఉట్నూర్ మండలం లింగోజీ తండాకు చెందిన మోతిపల్లి శివశంకర్ (19) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మోతిపల్లి గంగాధర్– శోభ దంపతులకు ముగ్గురు సంతానం. కూరగాయలు విక్రయిస్తూ పిల్లలను చదివిస్తున్నారు. వీరిలో శివశంకర్ పెద్ద కుమారుడు. నర్సాపూర్లోని బీవీ ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో కెమికల్ ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాల సమీపంలోని ఓ రూమ్లో ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్న సమయంలో తన గదిలో ఉరేసుకుని విగతజీవిగా మారాడు. తోటి విద్యార్థులు గమనించి సమాచారం అందించగా తల్లిదండ్రులు అక్కడికి బయలుదేరి వెళ్లారు. చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకుంటాడనుకున్న కొడుకు అర్ధంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కాగా, మృతుడి వద్ద సూసైడ్ నోట్ లభించినట్లు తెలిసింది. అందులో తన మృతికి ఎవరూ కారణం కాదని ఉన్నట్లుగా సమచారం.


