ఆదిలాబాద్టౌన్: జనాభా నియంత్రణ అందరి బాధ్యత అని డీఎంహెచ్వో సాధన అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, రోజురోజుకు పెరుగుతున్న జనాభాతో అనేక ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. ఇద్దరు లేదా ముగ్గురు అనే నినాదంతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వైసి శ్రీనివాస్, మాస్మీడియా అధికారి వెంకట్ రెడ్డి, ప్రోగ్రాం అధికారి దేవిదాస్, వైద్యాధికారులు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
వ్యాధుల నివేదిక సమర్పించాలి
ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు వ్యాధుల నివేదికతో పాటు రోగుల వ్యక్తిగత వివరాలు ఎప్పటికప్పుడు సమర్పించాలని డీఎంహెచ్వో సాధన అన్నారు. డీఎంహెచ్ఓ సమావేశ మందిరంలో ప్రైవేట్ వైద్యులతో మంగళవారం సమావేశం అయ్యారు. రోగుల వివరాలను ఐడీఎస్పీలో నమోదు చేయాలని సూచించారు. టీకాల ద్వారా నివారించగల వ్యాధుల అనుమానిత కేసులను ముందుగానే గుర్తించాలని, వారి వివరాలను తెలియజేయాలని పేర్కొన్నారు. అలాగే ఆస్పత్రుల్లో ఫీజు బోర్డులను ప్రదర్శించాలని ఆదేశించారు. ఇందులో డీఐఓ వైసీ శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారి దేవిదాస్, ఐఎంఏ ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


